ఎమ్మెల్యే పేపర్ మిల్లులో.. దళిత మహిళపై దారుణం..
లక్నో : మహిళలపై వేధింపులు.. అత్యాచారాలు.. దేశంలో నిత్యకృత్యంగా మారిపోయాయి. ఓ ఘటన జరిగి కొన్ని గంటలు గడవకముందే మరో ఘటన వెలుగులోకి వస్తుండడం, దేశంలో మహిళా భద్రతాను ప్రశ్నార్థకంలోకి నెట్టేస్తోంది. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ దళిత మహిళ (38) అత్యాచారం, హత్యకు గురైన ఘటన చర్చనీయాంశంగా మారింది.
అనుమానస్పదంగా మారిన ఈ ఘటన.. ముజఫర్ నగర్ లోని జనసాత్ సమీపంలో ఉన్న ఓ పేపర్ మిల్లులో చోటు చేసుకుంది. కాగా, ఆ పేపర్ మిల్లు ఓ బీఎస్పీ ఎమ్మెల్యేకు చెందినదిగా పోలీసులు గుర్తించడం గమనార్హం. మిల్లులో కార్మికురాలిగా పనిచేస్తోన్న మృతరాలు శుక్రవారం నాడు శవమై కనిపించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఘటన తర్వాత మిల్లుకు సంబంధించిన లేబర్ కాంట్రాక్టర్ పరారీలో ఉన్నట్టు సమాచారం.
ఘటనా స్థలాన్ని, శవాన్ని పరిశీలించిన పోలీసులు.. నిందితులు ఆమెపై అత్యాచారానికి పాల్పడి ఆ తర్వాత గొంతు నులిమి హత్య చేసి ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అనంతరం పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.