ముజఫర్పూర్ అత్యాచార ఘటన షాక్కు గురిచేసింది...నిందితుడిని మరో రాష్ట్ర జైలుకు తరలించండి: సుప్రీం
బీహార్ ముజఫర్నగర్లో వెలుగు చూసిన 30 మంది చిన్నారులపై అత్యాచారం ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటన భయంకరమైనదిగా అభివర్ణించింది. కేసుకు సంబంధించి జరిగిన విచారణ నివేదికను న్యాయస్థానం ముందు సీబీఐ ఉంచింది. నివేదికను చదివిన సర్వోన్నత న్యాయస్థానం ఘటనపై సీరియస్ అయ్యింది. ఈ కేసును విచారణ చేస్తోన్న జస్టిస్ మదన్ బీ లోకూర్ బెంచ్ ఇది చాలా భయంకరంగా ఉందంటూ పేర్కొంది.
30 మంది చిన్నారులకు డ్రగ్స్ ఇచ్చి అత్యాచారం చేశారు
ముజఫర్ నగర్లోని ఓ షెల్టర్ హోమ్లో 30 మంది చిన్నారులపై ఆ హోమ్ నిర్వహిస్తున్న బ్రిజేష్ ఠాకూర్ అత్యాచారానికి పాల్పడ్డారు. బ్రిజేష్ ఠాకూర్ రాష్ట్రంలో ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున ఆయన్ను ఇతర రాష్ట్రంలోని జైలుకు తరలించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. బ్రిజేష్ ఠాకూర్ చాలా ప్రభావం చూపించగల వ్యక్తి అని అతను బీహార్లో ఏజైలులో ఉంచడానికి వీలులేదని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీహార్ మాజీ మంత్రి మంజు వర్మ భర్త చంద్రశేఖర్ వర్మను ఎందుకు అరెస్టు చేయలేదని దీనిపై వివరణ ఇవ్వాలని బీహార్ ప్రభుత్వాన్ని, సీబీఐని కోరింది సర్వోన్నత న్యాయస్థానం. తన భర్త ఠాకూర్తో సత్సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలు రావడంతో జేడీయూ మహిళా నేత మంజు వర్మ తన మంత్రి పదవికి రాజీనామా చేశారు.