బీహార్ సీఎం నితీష్ కుమార్కు షాక్, సీబీఐ విచారణకు ఆదేశించిన ప్రత్యేక కోర్టు
లక్నో/పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్కు షాక్ తగిలింది. బీహార్లోని హాస్టల్లో బాలికలపై అత్యాచారం కేసు అంశంపై సీఎం నితీష్పై విచారణకు ప్రత్యేక కోర్టు శనివారం ఆదేశాలు జారీ చేసింది. సీఎంతో పాటు ముజఫర్పూర్ జిల్లా మెజిస్ట్రేట్, సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీను విచారించాలని ప్రత్యేక పోస్కో కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ముజఫర్పూర్ వసతి గృహంలో బాలికలపై అత్యాచారం, లైంగిక వేధింపుల కేసులో ఇప్పటికే సీబీఐ విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని అదుపులోకి తీసుకున్న సీబీఐ, కీలక ఆధారాలు సేకరించింది.
తాజాగా, ముజఫర్పూర్ ఘటనపై ప్రత్యేక న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో నితీశ్ కుమార్తోపాటు ఇద్దరు అధికారులను విచారించాలని ఆదేశించింది. బాలికలపై అఘాయిత్యాల వ్యవహారంలో మరికొందరు అధికారులకు ప్రమేయముందని, సీఎం నితీశ్కు సైతం సంబంధం ఉందని ఆరోపిస్తూ ఈ కేసులోని నిందితుల్లో ఒకరైన ఆర్ఎంపీ అశ్వని పిటిషన్ దాఖలు చేశాడు. సీబీఐ విచారణలో అసలు నిజాలు బయటకు రావడం లేదని, ముజఫర్పూర్ మాజీ డీఎం ధర్మేంద్ర సింగ్, సీనియర్ ఐఏఎస్ అధికారి ప్రస్తుత సాంఘిక సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి అతుల్ కుమార్ సింగ్, సీఎం నితీశ్ కుమార్ల పాత్రపై దర్యాప్తు చేయాలని అందులో కోరాడు. ఈ కేసును విచారించిన ప్రత్యేక పోస్కో న్యాయస్థానం విచారణకు ఆదేశించింది.
సంచలనం సృష్టించిన ఈ కేసును ఢిల్లీలోని పోస్కో కోర్టుకు ఫిబ్రవరి 7న సుప్రీం కోర్టు బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. వచ్చేవారం నుంచి దీనిపై పోస్కో కోర్టు విచారణ చేపట్టే అవకాశముందని సీబీఐ వర్గాలు వెల్లడించాయి. గత ఏడాది మేలో ముజఫర్పూర్ వసతి గృహంలో అత్యాచారాల ఘటన వెలుగు చూసింది.
హాస్టల్లోని 42 మంది బాలికల్లో 34 మందిపై లైంగిక దాడి జరిగినట్లు మెడికల్ పరీక్షలో తేలింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు వసతి గృహం నిర్వాహకుడు బ్రిజేశ్ ఠాకూర్ సహా పదకొండు మందిపై కేసు పెట్టారు. ఆ తర్వాత ఈ కేసును సీబీఐకి అప్పగించారు.