నీట్, జేఈఈ పరీక్షలు: ప్రభుత్వానికి విద్యార్థుల తరపున సోనియా సందేశం
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి వ్యాపిస్తున్న నేపథ్యంలో విద్యార్థుల ఆవేదనను, వారి మనోభావాలను వినాలని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. విద్యార్థుల జీవితాలకు సంబంధించి ప్రభుత్వం ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వారి అభిప్రాయాలను సైతం సేకరించాలని సూచించారు.
నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సోనియా ఆందోళన వ్యక్తం చేశారు. 'ప్రియమైన విద్యార్థులారా.. మీరు ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులపై చింతిస్తున్నా. ఈ సమయంలో పరీక్షలు నిర్వహించడం బాధాకరం. మీ తల్లిదండ్రులు సైతం ఆందోళనకు గురవుతున్నారు' అని సోనియా ఆ వీడియో సందేశంలో పేర్కొన్నారు.
అంతేగాక, మీరే మా భవిష్యత్తు. మెరుగైన దేశాన్ని నిర్మిస్తారని మేము మీపై ఆధారపడ్డాం. కాబట్టి మీ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే ముందు మీ అభిప్రాయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మీ కష్టాలను ప్రభుత్వం వినాలని కోరుకుంటున్నా.. అని సోనియా వ్యాఖ్యానించారు. విద్యార్థుల భద్రత కోసం మనమంతా గళమెత్తుదామని కోరారు.
Students are our future, we depend on them to build a better India, therefore, if any decision has to be taken regarding their future it is important that it is taken with their concurrence.: Congress President Smt. Sonia Gandhi #SpeakUpForStudentSafety pic.twitter.com/Jf18cmykbd
— Congress (@INCIndia) August 28, 2020
మరోవైపు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కూడా నీట్, జేఈఈ పరీక్షల నిర్వహణపై ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థుల తరపున దేశంలోని ప్రతీపౌరుడు గళమెత్తాలని రాహుల్ పిలుపునిచ్చారు. కాగా, జేఈఈ, నీట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ నెలలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
అయితే, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ పరీక్షలను వాయిదా వేయాలని పలువురు కోరుతున్నారు. కేంద్రం మాత్రం కరోనా నిబంధనలను పాటిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పరీక్షలను నిర్వహిస్తామని పేర్కొంది. కరోనా నేపథ్యంలో పరీక్షలను వాయిదా వేయాలన్న పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. మరో ఏడాది కూడా వైరస్ ఉంటే ఆ ఏడాదిని కూడా వృథా చేసుకుంటారా? అని ఈ సందర్భంగా సుప్రీం ప్రశ్నించింది.