‘నా రంగు కాషాయం మాత్రం కాదు’: కేరళ సీఎంతో భేటీపై కమల్ ఇలా
రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న ప్రచారం నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు.
చెన్నై/తిరువనంతపురం: తమిళనాట రాజకీయ రంగ ప్రవేశం చేస్తారన్న ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ప్రముఖ సినీ నటుడు కమల్ హాసన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ పెడతారా? లేక ఏదైనా పార్టీలో చేరతారా? అనే సందేహాలున్న క్రమంలో.. 'నా రంగు కచ్చితంగా కాషాయం కాదు' అని కమల్ తేల్చి చెప్పారు.
శుక్రవారం కేరళ ముఖ్యమంత్రి పినరయ్ విజయన్ తన అధికారిక నివాసం క్లిఫ్ హౌస్లో ఓనం పండగ సందర్భంగా ఇచ్చిన విందులో ఆయన పాల్గొన్నారు. తన రాజకీయ ప్రవేశం గురించి విజయన్తో చర్చించానని కమల్ అన్నారు. కేరళ సీఎం ఏ పార్టీకి చెందినవాడన్నది తనకు ముఖ్యం కాదని, ఆయన ఎలా పనిచేస్తున్నారన్నదే ప్రధానమని పేర్కొన్నారు.
నాటకాన్ని చూడదల్చుకోలేదు..
ఈ సందర్భంగా మీడియా తమిళనాడు రాజకీయ పరిణామాలపై ప్రశ్నించినప్పుడు ‘ఆ నాటకాన్ని చూడాలనుకోవడం లేదు. బలపరీక్ష జరపాలని, గవర్నర్తో మాట్లాడాలని చెప్పడానికి నేనెవర్నో కాదు! అది జరపాలని చెప్పడానికి ఈ వేదికను ఉపయోగించుకుంటున్నా' అని కమల్ చెప్పారు. అధికార ఏఐఏడీఎంకేలోని విభేదాల నేపథ్యంలో ఆయన పై వ్యాఖ్య చేశారు.
నా రంగు కాషాయం మాత్రం కాదు.. వారు హీరోలే
‘ఒక్క విషయం చెబుతాను. నా రంగు కచ్చితంగా కాషాయం కాదు. చాలా మంది వామపక్షవాదులు నా హీరోలు. ఏ పక్షంవైపు మొగ్గు చూపను. మధ్యేమార్గంలో ఉంటాను' అని రాజకీయ అనుబంధంపై ప్రశ్నించినప్పుడు కమల్ చెప్పారు. తాను జరుపుతున్న ఈ పర్యటన రాజకీయ అధ్యయనంలాంటిదని అన్నారు.
మర్యాదపూర్వకమే..
కమల్తో సమావేశంపై సీఎం విజయన్ ఫేస్బుక్లో సమాచారం పంచుకున్నారు. ఇది మర్యాదపూర్వక సమావేశమేనని, ఈ సందర్భంగా తమిళనాడు రాజకీయాలపై చర్చించామని వివరించారు.
వామపక్షాలతో కలిసి వెళతారా?
ఇటీవలి కాలంలో తమిళనాడు మంత్రులపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న కమల్.. హఠాత్తుగా కేరళ సీఎంను కలుసుకోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కాగా, కమల్ తనకు ఎన్నో ఏళ్లుగా పరిచయమున్న నటుడని, ఆయన ఎప్పుడు కేరళ వచ్చినా తనను కలుసుకుంటారని కేరళ సీఎం విజయన్ పేర్కొనడం గమనార్హం. అయితే, కమల్ వామపక్షాలతో కలిసి వెళతారా? అనే సందేహాలు కలుగుతున్నాయి.