భారత దేశమే నా కుటుంబం: 2 ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించిన నరేంద్ర మోడీ
న్యూఢిల్లీ: భారత దేశమే నా కుటుంబం అని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. మోడీ రెండు ఎక్స్ ప్రెస్ వేలను ప్రారంభించారు. 9 కి.మీ. పొడవైన ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే మొదటి దశ, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను ప్రారంభించారు. భాగ్పట్లో ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ప్రారంభించిన అనంతరం భారీగా హాజరైన జనాన్ని ఉద్దేశించి మాట్లాడారు.
తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల గురించి వివరించారు. కులం, మతం, ప్రాంతం, ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మౌలిక సదుపాయాల్లో తారతమ్యం చూపరాదన్నారు. నాలుగేళ్ల క్రితం దేశంలో మొబైల్ ఫోన్ల తయారీ కంపెనీలు రెండు ఉంటే భారత్లో తయారీ కార్యక్రమం కారణంగా వాటి సంఖ్య 120కు పెరిగిందన్నారు.
కాంగ్రెస్ పార్టీకి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదన్నారు. రిజర్వ్ బ్యాంకు, ఈవీఎం, సుప్రీం కోర్టు, ఎన్నికల కమిషన్.. ఇలా దేనిపై నమ్మకం లేదన్నారు. డెబ్బై ఏళ్లుగా కుటుంబమే రాజ్యమేలుతోందన్నారు. ఓ కుటుంబాన్ని ప్రేమించే వారు ప్రజాస్వామ్యాన్ని ఎలా గౌరవిస్తారన్నారు. అంతకుముందు ఆయన ఓపెన్ జీపులో రోడ్డు షో నిర్వహించారు.
కాగా, ప్రధాని మోడీ ప్రారంభించిన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వేను రూ.11,000 కోట్లతో 500 రోజుల్లోనే పూర్తి చేశారు. ఎక్కడా ట్రాఫిక్ సిగ్నల్స్ లేకుండా నిర్మించారు. ఇక 9 కి.మీ. ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే దేశంలో 14 లేన్లతో ఉన్న తొలి హైవే. దీన్ని 18 నెలల్లో పూర్తి చేశారు.