సిగ్గు పడడం లేదు: నిర్భయ పేరు చెప్పిన తల్లి
న్యూఢిల్లీ: మూడేళ్ల క్రితం దేశరాజధాని న్యూఢిల్లీలో బస్సులో జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో అసువులు బాసిన నిర్భయ తల్లి ఆమె పేరును వెల్లడించారు. తన కూతురు పేరు వెల్లడించడానికి తానేమీ సిగ్గుపడండ లేదని, తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని చెప్పారు. బహిరంగంగానే ఆమె తన కూతురు పేరును లోకానికి వినిపించింది.
సరిగ్గా మూడేళ్ల క్రితం ఇదే రోజున దేశరాజధాని ఢిల్లీలో కదులుతున్న బస్సులో వైద్య విద్యార్థినిపై ఆరుగురు కిరాతకులు అమానుషంగా సామూహిక అత్యాచారం చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో వైద్య విద్యార్థిని ఆస్పత్రిలో మరణించింది. 13 రోజుల తర్వాత ఆమె ప్రాణాలు వదిలింది.
ఆ ఉదంతాన్ని గుర్తు చేసుకుని వైద్య విద్యార్థిని తల్లిదండ్రులు ఆశాదేవి, బద్రినాథ్ తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు. తమ కూతురి పేరును వెల్లడించారు. తమ కూతురిపై దురాగతానికి ఒడిగట్టిన ఆరుగురు నిందితుల్లో చిన్నవాడైన మైనర్ను విడుదల చేయవద్దని వారు కోరారు. ఈ కేసులో అతను ఈ నెల 20వ తేదీన విడుదల కానున్నాడు.
తన కూతురు పేరు చెప్పేందుకు తాను ఏమీ సిగ్గపడడం లేదని, హింసకు గురైనవారు తమ పేర్లను దాచాల్సిన అవసరం లేదని, నేరస్తులు సిగ్గపడి తమ పేర్లను దాచుకోవాలి గానీ బాధితులు కాదని ఆశాదేవి అన్నారు. తన కూతురు పేరు అందరికీ చెప్పాలనుకుంటున్నానని, తన కూతురు పేరు జ్యోతిసింగ్ అని, ప్రతి ఒక్కరూ ఆమెను జ్యోతి సింగ్ అని పిలువాలని ఆమె చెప్పారు. ఢిల్లీలో జరిగిన బహిరంగ సభలో ఆమె బుధవారంనాడు మాట్లాడారు.
నిర్భయ ఉదంతం జరిగి మూడేళ్లు గడిచింది కాబట్టి నిందితుడ్ని విడుదల చేస్తామని అంటున్నారని, ఇదెక్కడి న్యాయమని ఆమె అన్నారు.