రాజకీయాల్లోకి వస్తున్నా, ద్రోహం చేయలేను, పిరికివాడు అంటారు, మీడియాతో భయం: రజనీకాంత్ సంచలనం
Recommended Video
చెన్నై: నేను రాజకీయాల్లోకి రావడం ఖాయమని రజనీకాంత్ చెప్పారు. మీడియాతో జాగ్రత్తగా ఉండాలని అభిమానులకు సూచించారు. కాలమే దీనిని నిర్ణయించిందని ఆయన వ్యాఖ్యానించారు. గెలిస్తే విజయం లేదంటే విరమణ అని తేల్చి చెప్పారు. తమిళనాడులో 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు.
రాజకీయాల్లోకి తాను డబ్బ కోసమే, పేరు కోసమో రావడం లేదని రజనీకాంత్ చెప్పారు. అవన్నీ నాకు ఇప్పటికే ఉన్నాయని చెప్పారు. తాను యుద్ధం చేస్తానని ఓటమి, గెలుపు దేవుడి దయ అని చెప్పారు.
65 ఏళ్ల వయస్సులో నాకు పదవిపై కోరిక పుడుతుందా
తనకు 45 ఏళ్ల వయస్సులో పదవి పైన కోరిక కలగలేదని రజనీకాంత్ అన్నారు. అలాంటిది ఇప్పుడు 65 ఏళ్ల వయస్సులో పుడుతుందా అని ప్రశ్నించారు. తాను డబ్బు కోసం, పేరు కోసం రాజకీయాల్లోకి రావడం లేదని చెప్పారు. అవన్నీ తనకు ఉన్నాయని తెలిపారు.
రాజకీయాలు చెడిపోయాయి
రాజకీయాలు ఇప్పుడు బాగా చెడిపోయాయని రజనీకాంత్ చెప్పారు. కొన్ని జరుగుతున్న రాజకీయ పరిణామాలతో తమిళనాడు ప్రజలు తీవ్ర మనస్తాపంతో ఉన్నారని చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లోను నేను రాజకీయాల్లోకి రాకపోవడం సబబు కాదన్నారు. అన్ని రాష్ట్రాలు తమిళ రాజకీయాలు చూసి నవ్వుతున్నాయని, ఇలాంటప్పుడు తాను రావాల్సిందే అన్నారు.
యుద్ధం చేయకుంటే పిరికివాడు అంటారు
ఇలాంటప్పుడు రాకుంటే తాను ద్రోహం చేసినవాడిని అవుతానని చెప్పారు. యుద్ధం చేయకుంటే పిరికివాడు అంటారని రజనీకాంత్ అన్నారు. తాను సొంతగానే పార్టీ పెడతానని చెప్పారు. 234 స్థానాల్లో పోటీ చేస్తానని చెప్పారు. ఇక గెలుపు, ఓటమి అంతా భగవంతుడికి వదిలేస్తానని చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతానని చెప్పారు.
రాజకీయాలు అంత సులువు కాదు
తనకు తమిళనాడు ప్రజలు అండగా నిలవాలని రజనీకాంత్ విజ్ఞప్తి చేశారు. రాజకీయాలు అంటే అంత సులువు కాదని చెప్పారు. అధికారం అంటే సముద్రంలో మునిగి ముత్యాలు ఎత్తినంత కష్టమని చెప్పారు.
అన్ని స్థానాల్లో సొంత పార్టీతో పోటీ, భ్రష్టు పట్టించారు
లోకసభ ఎన్నికల్లోను పోటీ చేస్తానని రజనీకాంత్ చెప్పారు. నేను రాజకీయాల్లోకి వస్తున్నానని, అన్ని స్థానాల్లోను పోటీ చేస్తానని చెప్పారు. తమిళనాట కొన్ని పార్టీలు రాజకీయాలను భ్రష్టు పట్టించాయని మండిపడ్డారు. పార్టీ ఏర్పాటులో అభిమానులతో కీలక పాత్ర అని రజనీకాంత్ అన్నారు. వ్యవస్థను మార్చే సమయం వచ్చిందని పేర్కొన్నారు. తనకు కార్యకర్తలు వద్దని, రక్షకులు కావాలన్నారు. ప్రభుత్వం తప్పులు చేసినా నిలదీసే రక్షకులు కావాలన్నారు.