నెహ్రుకు ప్రత్యామ్నాయం: నేతాజీ కూతురు సంచలనం
ఢిల్లీ: నేతాజీ సుభాష్ చంద్రబోస్ కూతురు అనితా బోస్ (73) ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. 1945 ఆగస్ట్ 18వ తేదీన విమాన ప్రమాదంలో ఆయన చనిపోయారన్న విషయాన్ని తాను నమ్ముతున్నట్లు చెప్పారు. స్వాతంత్ర్య పూర్వమే ప్రపంచవ్యాప్తంగా ఎంతో బలమైన నాయకుడు నేతాజీ అన్నారు.
ఆయన భారత్ తిరిగి వస్తే దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూకు ప్రత్యామ్నాయంగా ఉండేవారని చెప్పారు. జపాన్లోని రెంకోజీ దేవాలయంలో ఉంచిన నేతాజీ అస్థికలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని ఆమె కోరారు.బోస్ 119వ జయంతి సందర్భంగా ఆమె విలేకరులతో మాట్లాడారు.
ఈ వ్యవహారంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రయత్నాల పట్ల అనితా బోస్ హర్షం వ్యక్తం చేశారు. అయితే బోస్ మృతి మిస్టరీకి ఇప్పటికైనా ముగింపు పడుతుందో లేదో చూడాలన్నారు. నేతాజీకి సంబంధఇంచి ప్రత్యేక జ్ఞాపకాలు ఏవీ లేకపోయినప్పటికీ, ఆయన గొప్పదనం గురించి తల్లి చెబుతుండేదన్నారు.
భారతదేశం స్వాతంత్ర్యం కోసం సర్వం త్యాగం చేసిన వ్యక్తి తన తండ్రి అన్నారు. కొన్ని సమస్యలకు నెహ్రూ, తన తండ్రికి అభిప్రాయాలు ఒకేలా ఉన్నా, విభేదాలు కూడా ఉండేవన్నారు. పారిశ్రామీకరణనూ ఇద్దరూ కోరుకున్నారన్నారు. పాకిస్తాన్ విషయంలో మాత్రం చాలా తేడాలున్నాయని చెప్పారు.
బోస్ బతికి ఉంటే రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించేవారని, నెహ్రూకు ప్రత్యామ్నాయం అయ్యేవారన్నారు. పాకిస్తాన్తో సంబంధాలు మెరుగ్గా ఉండేలా ప్రయత్నించి, విజయం సాధించి ఉండేవారన్నారు. తన జీవితాన్ని దేశానికి అంకితం చేసిన ఓ వ్యక్తి.. రాజకీయాలకు, దేశానికి దూరంగా ఎక్కడో పర్వతాల్లో ఉంటారంటే నమ్మమని చెప్పారు.
దేశ ప్రజలు తన తండ్రిని ఆ వివాదం ద్వారా గుర్తు పట్టడం విచారించాల్సిన విషయమన్నారు. ఈ వ్యవహారంలో భారత్, జపాన్ ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలన్నారు. దశాబ్దాలుగా ఇంత చర్చ జరుగుతున్నా జపాన్ ఈ నిజాలను బయట పెట్టకపోవడం ఆ దేశానికే అవమానమన్నారు.