నా భర్త కనిపించడం లేదు: హార్ధిక్ పటేల్ భార్య, అసలు ఏం జరిగిందంటే..?
గాంధీనగర్: పటేల్ రిజర్వేషన్ల కోసం పోరాడిన ఉద్యమ నేత హార్థిక్ పటేల్ గత 20 రోజులుగా కనిపించడం లేదంటూ ఆయన భార్య కింజల్ పటేల్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుజరాత్ అధికార యంత్రాంగం వేధింపులే ఆయన కనిపించకపోవడానికి కారణమని ఆరోపించారు.
గత 20 రోజులుగా హార్ధిక్ పటేల్ ఆచూకీ మిస్సింగ్
20 రోజులుగా తన భర్త ఆచూకీ గురించి ఎలాంటి సమాచారం లేదని కింజల్ పటేల్ వాపోయారు. ఈ మేరకు ఆమె ఇంటర్నెట్లో ఓ వీడియోను విడుదల చేశారు. 2017లో పటేళ్లపై ఉన్న అన్ని కేసులను ఉపసంహరిస్తామని అప్పుడే చెప్పిన ప్రభుత్వం.. ఇప్పటికీ హార్ధిక్ పటేల్ను లక్ష్యంగా చేసుకుని ఎందుకు వేధింపులకు పాల్పడుతున్నారంటూ గుజరాత్ ప్రభుత్వంపై మండిపడ్డారు.
హార్ధిక్ పటేల్ లక్ష్యంగా వేధింపులు...
బీజేపీలో చేరిన ఇద్దరు పటేల్ నేతల పట్ల ఎందుకు ఉదారంగా వ్యవహరిస్తున్నారని కింజల్ పటేల్ నిలదీశారు. హార్దిక్ పటేల్ ప్రజలను కలుపుకుని, వారి సమస్యలను ప్రస్తావించడం ప్రభుత్వానికి ఇష్టం లేదని కింజల్ పటేల్ అన్నారు. హార్ధిక్ పటేల్ ఎక్కడ ఉన్నారనేది వెల్లడికాకున్నా.. చివరిసారిగా ఆయన ఫిబ్రవరి 11న తన ట్విట్టర్ ఖాతా నుంచి ఢిల్లీ ఎన్నికల్లో విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్కు శుభాకాంక్షలు చెప్పారు. రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తనను బయటకు రాకుండా నిరోధించేందుకు జైలులో ఉంచాలని గుజరాత్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఫిబ్రవరి 10న ఆరోపించారు.
తప్పుడు కేసులు పెట్టి..
నాలుగేళ్ల క్రితం గుజరాత్ పోలీసులు తనపై తప్పుడు కేసును నమోదు చేశారని, లోక్సభ ఎన్నికల నేపథ్యంలో తనపై నమోదైన కేసుల గురించి అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ను సంప్రదించగా ఆ సమయంలో తనపై ఈ కేసు లేదని ఆయన ట్వీట్లో పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి తనను కస్టడీలోకి తీసుకునేందుకు తన ఇంటికి పోలీసులు వచ్చారని, ఆ సమయంలో తాను ఇంట్లో లేనని ఆ ట్వీట్లో హార్ధిక్ పటేల్ పేర్కొన్నాడు.
నిర్బంధించేందుకు బీజేపీ సర్కారు..
అంతేగాక, ఈ కేసులో ముందస్తు బెయిల్ పటిషన్ హైకోర్టులో విచారణ జరుతుండగా తనపై నాన్ బెయిలబుల్ వారెంట్ల జారీ చేశారని వారెంట్లు జారీ చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. తనను నిర్బంధించేందుకు గుజరాత్ సర్కారు ప్రయత్నిస్తోందని ఆయన మరోసారి ఆరోపించారు. తనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని చెప్పారు. అయినా తాను ప్రజల తరపున బీజేపీకి వ్యతిరేక పోరాటం చేస్తానని అన్నారు. తాను ప్రజా సేవలోనే ఉంటానన చెప్పారు.