ఘోర ఓటమి: తొలిసారి ఇంటర్యూ ఇచ్చిన కెప్టెన్ భార్య
చెన్నై: పార్టీ నుంచి ఎందరు వెళ్లినా తమ బలం తమదేనని డీఎండీకే అధినేత విజయకాంత్ సతీమణి ప్రేమలత ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే డిపాజిట్ కోల్పోయిన నేపథ్యంలో ప్రేమలత జోక్యం పార్టీలో ఉండకూడదంటూ కెప్టెన్కు హెచ్చరికలు, సూచనలు పెరిగారు.
తనపై పార్టీ వర్గాలు తీవ్ర ఆగ్రాహాన్ని ప్రదర్శిస్తున్నా, ఇన్నిరోజులు మౌనంగా ఉంటూ వచ్చిన ప్రేమలత శుక్రవారం స్థానిక మీడియాకు ఇంటర్యూ ఇచ్చారు. తానేమిటో, కెప్టెన్ ఏమిటో వివరిస్తూ, పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదన్నారు. కెప్టెన్ ఏ నిర్ణయాన్నైనా కార్యకర్తలతో చర్చించి తీసుకుంటారని ఆమె స్పష్టం చేశారు.
డీఎంకే, అన్నాడీఎంకేలకు ప్రత్యామ్నాయ శక్తిగా డీఎండీకే అవతరించాలన్న లక్ష్యంతో ప్రజాసంక్షేమ కూటమితో జతకలిశామని ప్రేమలత ఈ సందర్భంగా పేర్కొన్నారు. అవినీతి డీఎంకేను తరిమి కొట్టడమే లక్ష్యంగా 2011లో జరిగిన అన్నాడీఎంకేతో చేతులు కలపామన్నారు.
ఆ తర్వాత అన్నాడీఎంకే తీరు నచ్చక బయటకు వచ్చి, ప్రజల పక్షాన నిలబడి ఉద్యమించామన్నారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజా కూటమికి నేతృత్వం వహించడం జరిగిందన్నారు. ఎన్నికల చివరి క్షణంలో ఎండీఎంకే నేత వైగో కూటమికి పెద్ద షాక్ ఇచ్చారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అది ఆయన వ్యక్తిగత నిర్ణయమైనా, చివరి క్షణంలో పోటీకి దూరంగా ఉండడం ఎంతో ఆవేదన కలిగించిందన్నారు. నిర్ణయాన్ని మార్చుకోవాలని ఒత్తిడి తెచ్చినా, ఆయన ఏ మాత్రం తగ్గలేదని ఆమె అసహనం వ్యక్తం చేశారు. ఇక రాబోయే స్థానిక ఎన్నికల్లో ఒంటరిగా పోటే చేయాలా లేక పొత్తు పెట్టుకోవాలా అనే దానిపై కెప్టెన్ త్వరలోనే ప్రకటిస్తారని చెప్పారు.
కాగా, ప్రజాసంక్షేమ కూటమి నుంచి బయటకు వచ్చినట్టుగా కెప్టెన్ స్వయంగా ఇంత వరకు ప్రకటించలేదుగా అని ఓ ప్రశ్నకు సమాధానం చెప్పారు. డీఎంకే అధికారంలోకి రాకపోవడానికి తమ పార్టీయేనని ఆమె వివరించారు. తమతో పొత్తుకు డీఎంకే ముందుకు రాని దృష్ట్యా, అధికారం వారి చేతికి చిక్కలేదని ఎద్దేవా చేశారు.
డీఎంకే అవినీతి పార్టీ అన్న విషయాన్ని కెప్టెన్ ఎప్పుడో పరిగణించారని, అందుకే వారి వెంట వెళ్లకూడదన్న నిర్ణయంతో ఆది నుంచి దూరంగా ఉన్నామని ఆమె పేర్కొన్నారు. ప్రజా సంక్షేమ కూటమి వల్ల మీకొచ్చిన లాభం ఏంటీ అని ప్రశ్నకు గాను లోక్సభ ఎన్నికల్లో 37 సీట్లను గెలుచుకున్న అన్నాడీఎంకేతో ఏమి లాభపడ్డామో అదేనంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు.
డీఎండీకే నుంచి ఎందరు బయటకు వెళ్లినా, కెప్టెన్ బలం... కెప్టన్దే... మా బలం మాదే అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. వెళ్తున్న వాళ్లందరూ ద్రోహులు అని, చంద్రకుమార్ లాంటి వారికి రాజకీయ భవిష్యత్తును ఇచ్చింది కెప్టెన్ కాదా అని ఆమె ఆగ్రహాం వ్యక్తం చేశారు. వెళ్తూ.. వెళ్తూ నిందల్ని వేయడం చూస్తుంటే, ఏ మేరకు కెప్టెన్కు ద్రోహం చేస్తున్నారో అర్థం చేసుకోవాలని అన్నారు.
ఎంత మంది నాయకులు బయటకు వెళ్లినా, కెప్టెన్కు అభిమానులు లక్షల్లో వెన్నంటి ఉన్నారని, వాళ్లను కదిలించడం అంత సులభం కాదన్నారు. పార్టీ వ్యవహారాల్లో తానెప్పుడూ జోక్యం చేసుకోలేదని, చేసుకోబోనని ఆమె స్పష్టం చేశారు. ఏదైనా నిర్ణయం తీసుకున్న తర్వాత చివరకు తనకు సమాచారం ఇస్తారేగానీ, ఎన్నడూ తనకు ముందే ఎలాంటి విషయాలు చెప్పరని అన్నారు.