మోడీ పాలనపై కేజ్రీ: 'ధనికుల కోసమే, నా పాలన ప్రజల కోసం'
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడీ పాలనకన్నా తాను మెరుగైన పాలన అందించగలనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తాను కామన్ మ్యాన్ను కేంద్రంగా చేసి పరిపాలన సాగిస్తుంటే, ప్రధాని మోడీ పాలన ధనిక వర్గాలను కేంద్రంగా చేసుకొని సాగుతోందని విమర్శించారు.
ప్రస్తుతం తాను ఢిల్లీ ప్రజల సమస్యలపైనే దృష్టి పెడుతున్నానని, పార్టీలోని అంతర్గత విభేదాలపై కాదని చెప్పారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల సమయంలో ప్రజల ముందు రెండు రకాల ప్రభుత్వాలున్నాయని అన్నారు. ఒకటి కేజ్రీవాల్ చేసిన 49 రోజుల పాలన కాగా, మరొకటి నరేంద్రమోడీ చేసిన 8 నెలల ప్రభుత్వ పాలన అని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ 8 నెలల పాలనకన్నా 49 రోజుల కేజ్రీవాల్ పాలన మెరుగైనదిగా భావించిన మీదటే గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తమవెంట నిలిచారని అన్నారు. రాబోయే రోజుల్లో అధికారస్వామ్యం, పరిపాలన విభాగాల నిర్మాణ పద్ధతుల్లో సమూల మార్పులు తీసుకురానున్నట్లు కేజ్రీవాల్ చెప్పారు.
అంబానీకైనా ఆమ్ ఆద్మీకైనా ఒకటే రూల్: ప్రధాని మోడీ
ఇటీవల ఓ పత్రికకు ఇచ్చిన ఇంటర్యూలో ప్రధాని మోడీ దేశంలో కుబేరుడికైనా, సామాన్యుడికైనా ఒకే నిబంధనలు వర్తిస్తాయని తేల్చి చెప్పారు. కోటీశ్వరుల కోసం ఒక విధమైన చట్టాలు, సామాన్యుడికి మరోవిధమైన చట్టాలు ఉండవని అన్నారు. ఎర్రతివాచీ ఉండకూడదన్నది తమ పాలసీ అని, దీనికి అర్ధం కేవలం ముకేష్ అంబానీకి ఎర్రతివాచీతో ఇబ్బందులు లేకుండా చేసి, సామాన్యులను మాత్రం ఇబ్బందులు కలిగించడం కాదని పేర్కొన్నారు.
మోడీ ప్రధాని అయిన తర్వాత కార్పోరేట్ వర్గాలకు ఎర్రతివాచీ పరుస్తున్నారనే వాదనలను కూడా ఆయన తిప్పికొట్టారు. ప్రతిఒక్కరికి ‘స్పూన్ ఫీడింగ్' చేయడం తన పని కాదని, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకోవడమా? లేక ఉన్న చోటే ఉండిపోవడమా? అన్నది పారిశ్రామిక వర్గాలు నిర్ణయించుకోవాలన్నారు.
మీరు ఒక అడుగు ముందుకు వేస్తే తాము రెండడుగులు ముందుకేస్తామన్నారు. మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు వత్తాసు పలుకుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటే, మరోవైపు తమకోసం ఏమీ చేయడం లేదని కార్పొరేట్ వర్గాలంటున్నాయని మోడీ వ్యాఖ్యానించారు.