ఈ దేశం కోసం నా తల్లి త్యాగం చేశారు, కష్టాలు ఎదుర్కొన్నారు: మోడీకి రాహుల్ కౌంటర్
బెంగళూరు: కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై పలు ఆరోపణలు చేశారు. బాబా సాహెబ్ అంబేడ్కర్ అంటే కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం గౌరవం లేదని, అందుకే ఆ పార్టీ హయాంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని అన్నారు. దళితుల్లో, బీసీల్లో కాంగ్రెస్ పార్టీకి స్థానమే లేదని పేర్కొన్నారు.
మోడీ చేసిన ఈ వ్యాఖ్యలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కౌంటర్ ఇచ్చారు. 'కాంగ్రెస్ పార్టీ దళితులను పట్టించుకోలేదని, బీఆర్ అంబేడ్కర్కు భారత రత్న కూడా ఇవ్వలేదని అంటున్నారు. మరి దళితులను హింసిస్తున్న బీజేపీని ఏమనాలి?, రోహిత్ వేముల మరణంపై ఒక్క మాటైనా మోడీ ఎందుకు మాట్లాడలేదు?. దేశంలో ఇప్పటికీ దళితులపై ఎన్నో అకృత్యాలు జరుగుతున్నాయి. పోలీస్ నియామకాల్లో దళితుల ఛాతీపై కులం పేరు రాసిన ఘటనపై మోడీ ఎందుకు స్పందించలేదు?' అని రాహుల్ ప్రశ్నించారు.
అదే సమయంలో ఈ సమస్యలన్నింటిపై కాంగ్రెస్ పార్టీ స్పందిస్తోందని అన్నారు. మహిళలపై దాడులు జాతీయ సమస్యగా మారాయని, అయినా సరే మోడీ బుల్లెట్ రైళ్ల గురించి మాట్లాడుతారే తప్ప వాటి గురించి మాట్లాడరని అన్నారు.
గత 15ఏళ్లుగా తాను దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలు, మసీదులు, చర్చిలు, గురుద్వారాలు ఇంకా ఇతర మత పరమైన ప్రదేశాలన్నీ తిరుగుతున్నానని రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ ఒక్కసారైనా ఆ పనిచేసిందా? అని ప్రశ్నించారు. మిగతా మతాలను పక్కనపెట్టాలనే నియమం అసలు హిందూ మతంలో ఎక్కడైనా ఉందా? అని నిలదీశారు.
మోడీ స్వతహాగా కోపిష్టి అని, ఆయన అందరితోనూ అలాగే మాట్లాడుతారని అన్నారు. 'కోపిష్టులకు నేను ఆకర్షణీయంగా కనిపిస్తానేమో!' అని వ్యంగ్యాస్త్రం సంధించారు. అందుకే మోడీ ఎప్పుడూ తనపై కోప్పడుతుంటారని అన్నారు.
కర్ణాటక ఎన్నికలపై:
కర్ణాటక ఎన్నికల గురించి ప్రస్తావిస్తూ.. రాష్ట్రం నుంచి రూ 35,000 దోచుకెళ్లిన యడ్యూరప్ప, రెడ్డి సోదరులకు మద్దతుగా మోడీ ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. మోడీ ప్రతిపక్షాలపై విమర్శలు చేయడం తప్ప తానేం చేస్తానో స్పష్టంగా చెప్పడం లేదని అన్నారు.
సోనియా గాంధీ:
సోనియా గాంధీ భారతీయురాలు కాదు ఇటాలియన్ అంటూ మోడీ చేసిన వ్యాఖ్యలపై కూడా రాహుల్ స్పందించారు. 'నా తల్లి ఒక ఇటాలియన్. కానీ ఆమె జీవితంలో ఎక్కువ భాగం ఇండియాలోనే గడిచింది. ఈ దేశం కోసం ఆమె ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నది, త్యాగాలు చేసింది. భారతీయులమని చెప్పుకుని చాలామంది కంటే ఎక్కువగా ఆమె భారతీయతను కలిగి ఉన్నది' అని రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. మోడీ ఆమెను దూషించడంలో ఆయన అసలు స్వరూపం ఏంటో బయటపడుతుందన్నారు.