నా యూనిఫామే నా మతం, అమ్మవారి ఆశీస్సులతోనే: 'కథువా' కేసు దర్యాఫ్తు అధికారి శ్వేతాంభరి
కాశ్మీర్: 'నా యూనిఫాం.. నా మతం' ఇది కథువాలో ఎనిమిదేళ్ల బాలిక అత్యాచారం కేసును దర్యాఫ్తు చేసిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం (సిట్) సభ్యురాలు శ్వేతాంభరి శర్మ వ్యాఖ్య. ఈ కేసు దర్యాఫ్తులో ఆమె పాత్ర ఎంతో ఉంది.
ఈ కేసులో నిందితులకు సంబంధించిన వారు తమపై ఎన్నో రకాల ఒత్తిళ్లు తీసుకు వచ్చారని, బెదిరింపులకు కూడా పాల్పడ్డారని, కానీ తాము న్యాయం వైపు నిలిచామని శ్వేతాంభరి శర్మ వ్యాఖ్యానించారు.
ఈ కేసులో ఆధారాలు లేకుండా చేసేందుకు ఓ పోలీసు కూడా ప్రయత్నించారని, బాధితురాలి దుస్తులు సహా ఎలాంటి ఆధారాలు లేకుండా చేశారని పేర్కొన్నారు. పవిత్రమైన నవరాత్రుల సమయంలో ఈ కేసును చేధించామన్నారు. నిందితులను గుర్తించడంలో దైవ జోక్యం కూడా ఉందని తాను బలంగా విశ్వసిస్తున్నానని, మాకు దుర్గామాత ఆశీస్సులు ఉన్నాయని నమ్ముతున్నానని చెప్పారు.
ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ నిరాహార దీక్ష
కథువా, యూపీలోని ఉన్నావ్ ఘటనల్లో న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ చేస్తున్న నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమె దీక్ష నాలుగో రోజుకు చేరుకుంది. దారుణమైన అత్యాచార ఘటనలను నిరసిస్తూ ఆమె శుక్రవారం రాజ్ఘాట్ వద్ద దీక్షకు కూర్చున్నారు.
అత్యాచారాలకు పాల్పడిన వారికి కఠిన శిక్షలు విధించేలా చట్టాలు తీసుకురావాలన్నారు. మైనర్లపై అత్యాచారానికి పాల్పడిన వారికి ఆరు నెలల్లోగా మరణ శిక్ష విధించాలన్నారు.
ఉన్నావ్లో 16ఏళ్ల బాలికపై బీజేపీ ఎమ్మెల్యే కుల్దీప్ సెంగార్ అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కథువాలో ఎనిమిదేళ్ల బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడి అత్యంత కిరాతకంగా హత్య చేశారు.