బిజెపి చెప్పిందే నేనూ : వ్యాపం, లలిత్ గేట్పై అద్వానీ
గాంధీ నగర్: భారతీయ జనతా పార్టీ అగ్రనేత లాల్ కృష్ణ అద్వానీ మధ్యప్రదేశ్లో వెలుగు చూసిన వ్యాపం కుంభకోణంతో పాటు లలిత్ గేట్ వివాదంపై గురువారం స్పందించారు. తన అభిప్రాయం బిజెపిదే అవుతుందని అద్వానీ చెప్పారు.
వ్యాపం, లలిత్ గేట్ వ్యవహారంలో బిజెపి స్పందన పైన ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రమంత్రి సుష్మా స్వరాజ్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, రాజస్థాన్ సిఎం వసుంధర రాజేలు పార్టీ ప్రతిష్టను మసకబార్చారని మీరు భావిస్తున్నారా అని విలేకరులు ప్రశ్నించారు.
దీనిపై అద్వానీ స్పందిస్తూ... ఇలాంటి వివాదాలను పరిష్కరించేందుకు ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చారో వారే పరిష్కరిస్తారని చెప్పారు. ఈ అంశాలపై పార్టీ నిర్ణయం, తన నిర్ణయం ఒకటేనని తెలిపారు. ఈ విషయంలో తనకు ప్రత్యేక అభిప్రాయం లేదన్నారు. పార్టీ తీరు సంతృప్తిగానే ఉందని చెప్పారు.
ప్రధాని వారణాసి పర్యటన రద్దు
తాను ప్రాతినిధ్యం వహిస్తున్న లోకసభ నియోజకవర్గం వారణాసిలో గురువారం జరగాల్సిన ప్రధాని నరేంద్ర మోడీ పర్యటన రద్దయింది. ఎడతెరిపిలేని వర్షాలు, బహిరంగ సమావేశం జరగాల్సిన వేదిక వద్ద జరిగిన ప్రమాదంలో కార్మికుడు మృతి చెందాడు. దీంతో పర్యటన రద్దయింది.