ప్రధాని మోడీని కదిలించిన సుజిత్ ఉదంతం: సీఎంకు ఫోన్
చెన్నై: తమిళనాడును విషాదంలో ముంచెత్తిన రెండేళ్ల బాలుడు సుజిత్ విల్సన్ ఉదంతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీని సైతం కదిలించింది. నాలుగు రోజుల కిందట బోరుబావిలో పడిన సుజిత్ కోసం ప్రభుత్వం చేపట్టిన పనుల గురించి ఆయన ఆరా తీశారు. సోమవారం మధ్యాహ్నం ఆయన తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామికి ఫోన్ చేశారు. బాలుడి వెలికితీత పనులను అడిగి తెలుసుకున్నారు. సుజిత్ క్షేమంగా తిరిగి వస్తాడనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
తమిళనాడులోని తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలోని నడుకట్టుపట్టికి చెందిన రెండేళ్ల సుజిత్ విల్సన్.. ఈ నెల 25వ తేదీన సాయంత్రం 5 గంటల సమయంలో ఆడుకుంటూ దురదృష్టవశావత్తూ బోరుబావిలో పడిన విషయం తెలిసిందే. అప్పటి నుంచీ ఆ బాలుడిని వెలికి తీయడానికి పోలీసులు, అగ్నిమాపక బలగాలు, జాతీయ, రాష్ట్ర స్థాయి విపత్తు నిర్వహణ బలగాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి.
సుజిత్ విల్సన్ వెలికితీత పనులు నాలుగో రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రధానమంత్రి స్పందించారు. ఈ విషాదకర ఉదంతానికి గల కారణాలను ఆయన పళని స్వామిని అడిగి తెలుసుకున్నారు. సుజిత్ ప్రాణాలతో తిరిగి రావాలని తాను ప్రార్థిస్తున్నానని చెప్పారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ట్వీట్ చేశారు.
My prayers are with the young and brave Sujith Wilson. Spoke to CM @EPSTamilNadu regarding the rescue efforts underway to save Sujith. Every effort is being made to ensure that he is safe. @CMOTamilNadu
— Narendra Modi (@narendramodi) October 28, 2019
కాగా- నాలుగు రోజులుగా ఈ పనులు కొనసాగుతూనే వస్తున్నాయి గానీ సుజిత్ ను చేరుకోలేకపోతున్నారు. సమాంతరంగా గొయ్యి తవ్వుతున్న పనుల వల్ల సుజిత్ మరింత లోతుకు జారిపోతున్నాడు. ప్రారంభంలో 25 అడుగుల లోతులో చిక్కుకున్న సుజిత్.. క్రమంగా 60 అడుగులు, అనంతరం 90 అడుగుల లోతుకు చేరుకున్నాడు. తాజా సమాచారం ప్రకారం.. ఓఎన్జీసీకి చెందిన డ్రిల్లింగ్ యంత్రాలను వెలికితీత పనుల్లో వినియోగిస్తున్నారు.
డ్రిల్లింగ్ చేస్తున్న కొద్దీ రాళ్లు తగులుతున్నాయని రెవెన్యూ సిబ్బంది వెల్లడించారు. రాతిపొరల వల్ల ఆశించినంత వేగంగా డ్రిల్లింగ్ వేయలేకపోతున్నామని పేర్కొన్నారు. రామనాథపురం నుంచి ఓఎన్జీసీకి చెందిన హైస్పీడ్ డ్రిల్లింగ్ యంత్రాలను వినియోగిస్తున్నామని చెప్పారు. బాలుడి వెలికితీత పనులను తమిళనాడు ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం పర్యవేక్షించారు. ఆదివారం రాత్రి నడుకట్టుపట్టికి చేరుకున్న ఆయన తెల్లవారేంత వరకూ అక్కడే ఉన్నారు.
సుజిత్ ఉదంతంపై కాంగ్రెస్ మాజీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పందించారు. సుజిత్ క్షేమంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నానని చెప్పారు. దేశమంతా దీపావళి వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొంటున్న పరిస్థితుల్లో తమిళనాడు విషాదకర వాతావరణం నెలకొందని అన్నారు. సుజిత్ కోసం తమిళనాడు ఎదురు చూస్తోందని, ఆ బాలుడిని రక్షించుకోవాలన్న ప్రయత్నంలో ఉందని ట్వీట్ చేశారు.