గవర్నర్ ను అసెంబ్లీ గేటు కూడా తాకనివ్వని మమత సర్కార్: నిరసన.. గేట్ 2 నుంచి ఎంట్రీ..!
కోల్ కత: మన దేశ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్ ముద్ర ఉన్న ఒకే ఒక్క రాజకీయ నాయకురాలు.. మమతా బెనర్జీ. తన వైఖరేమిటో, ఎలాంటిదో ఆమె మరోసారి నిరూపించుకున్నారు. స్వయానా గవర్నర్ కు అసెంబ్లీ ఆవరణలోనికి ప్రవేశం కల్పించడానికి నిరాకరించారు. రాజ్యాంగ ప్రతినిధికి, ప్రజా ప్రతినిధులు సమావేశం కావాల్సిన చోట పనేమిటంటూ హూంకరించారు. దీనికి నిరసనగా గవర్నర్ నడి రోడ్డు మీద నిరసన వ్యక్తం చేశారు. కొద్ది సేపటి తరువాత ఆయనకు గేట్ నంబర్ 2 నుంచి ప్రవేశం కల్పించారు.
హైదరాబాద్ లో 144 సెక్షన్: 24 గంటల పాటు: ఈ సారి ప్రత్యేకం..!
కేంద్రంలో భారతీయ జనతా పార్టీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి పేరు వింటే ఒంటి కాలి మీద లేస్తుంటారు మమతా బెనర్జీ. ఆ కేంద్ర ప్రభుత్వ సిఫారసుల మేరకు నియమితులైన గవర్నర్ అంటే మమతా బెనర్జీకి గిట్టదు. చాలా సందర్భాల్లో గవర్నర్ పరోక్షంగా విమర్శలు గుప్పించారు. ఈ సారి ఓ అడుగు ముందుకేశారు. గవర్నర్ ను అసెంబ్లీ ఆవరణలోనికి రానివ్వకుండా అడ్డుకున్నారు.
గవర్నర్ జగ్దీప్ ఢంకర్ గురువారం ఉదయం అసెంబ్లీకి చేరుకున్నారు. ఆయన కారు ప్రధాన గేటు వద్దకు చేరుకోవడానికి ముందే అక్కడి భద్రతా సిబ్బంది ప్రధాన గేటును మూసివేశారు. గవర్నర్ కార్యాలయం అధికారులు గేటు తెరవాలని ఆదేశించినప్పటికీ..వారు పట్టించుకోలేదు. గవర్నర్ ను అసెంబ్లీ భవనంలోని ప్రవేశించడానికి తమకు అనుమతి లేదని తేల్చి చెప్పారు. కొద్దిసేపటి తరువాత గవర్నరే కారు నుంచి కిందికి దిగారు. గేటును తెరవాలని సూచించినప్పటికీ..భద్రతా సిబ్బంది ఆ పని చేయలేదు.
దీనితో ఆయన అక్కడే నిరసన తెలిపారు. తాను అసెంబ్లీ సమావేశాలను పర్యవేక్షించడానికేమీ రాలేదని చెప్పారు. అసెంబ్లీ భవనానికి శతాబ్దాల నాటి చరిత్ర ఉందని, ఆ కట్టడాన్ని చూడటానికి మాత్రమే తాను వచ్చానని అన్నారు. అసెంబ్లీ గ్రంధాలయంలో అరుదైన పుస్తకాలను భద్రపరిచారని, వాటిని తీసుకెళ్లడానికి రావాల్సి వచ్చిందని చెప్పారు. సుమారు అరగంటకు పైగా గవర్నర్, అసెంబ్లీ ప్రధాన గేటు వద్దే విలేకరులతో మాట్లాడుతూ గడిపారు.
#UPDATE West Bengal Governor Jagdeep Dhankar enters state Assembly from gate number 2 as gate number 1 of the Assembly was closed. https://t.co/c4nUq1Pj2J pic.twitter.com/DkJyCWCRy7
— ANI (@ANI) December 5, 2019
ఈ సందర్భంగా ఆయన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై నిరసనను వ్యక్తం చేశారు. మమతా బెనర్జీ ప్రభుత్వం వ్యక్తిగత కక్షతోనే ఇలా ప్రవర్తిస్తోందని ఆరోపించారు. రాజ్యాంగ ప్రతినిధిగా వ్యవహరించే గవర్నర్ ను కించపర్చడం సరికాదని అన్నారు. వ్యక్తిగత విభేదాలు, కక్షలతో పరిపాలన సాగించలేరని హెచ్చరించారు. ఆయన మాట్లాడుతున్న సమయంలోనే అసెంబ్లీ భద్రతాధికారులు ఆయనకు లోనికి ప్రవేశం కల్పించారు. గేట్ 2 నుంచి లోనికి తీసుకెళ్లారు. సాధారణంగా గవర్నర్, ముఖ్యమంత్రికి మాత్రమే గేట్ 1 నుంచి అసెంబ్లీలోనికి ప్రవేశించి అధికారం ఉంటుంది. అయినప్పటికీ.. ఆయనను ఎమ్మెల్యేలు ప్రవేశించే.. గేట్ 2 నుంచి ఎంట్రీ కల్పించడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.