‘దేశాన్ని ద్వేషిస్తే.. నా కొడుకు శవాన్ని కూడా చూడను’
తిరువనంతపురం: కేరళ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులు ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళ్లినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. వారిలో ఓ యువకుడి తండ్రి తన ఆవేదనను మీడియాతో పంచుకున్నారు. తనను తన కొడుకు 'కఫీర్' అని పిలిచాడని వాపోయారు.
తనకు జన్మనిచ్చిన భారతదేశాన్ని ఇష్టపడకుండా...దేశానికి వ్యతిరేకంగా పనిచేస్తే కన్న కొడుకైనా తనకొద్దని అబ్ధుల్ హకీం తేల్చి చెప్పారు. కేరళకు చెందిన 20 మంది యువకులు గత కొంత కాలంగా అదృశ్యమైన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో సదరు యువకులు ఐఎస్ఐఎస్ లో చేరేందుకు వెళ్లారని సందేశాలులు వచ్చాయి. దీంతో ఐఎస్ఐఎస్లో చేరిన యువకుల తల్లిదండ్రులు ఏమంటున్నారో తెలుసుకునేందుకు మీడియా యత్నించగా వారు తమ కుమారుల చర్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తిరువనంతపురానికి చెందిన హఫీసుద్దీన్ (22) ఐఎస్ఐఎస్ లో చేరాడని తన తండ్రి అబ్ధుల్ హకీంకు పెట్టిన ఫోన్ మెసేజ్తో తేలింది. 'తనకు ఇప్పుడు స్వర్గం దొరికిందని, అందులో పన్నులు వేయరని, షరియా చట్టం లేదని' ఐఎస్ఐఎస్లో చేరిన హఫీసుద్దీన్ తన తండ్రికి పంపిన మెసేజ్లో పేర్కొన్నాడు.
తీవ్రవాద ప్రభావానికి గురై ఐఎస్ఐఎస్లో చేరిన కుమారుడి తీరుపై తండ్రి అబ్దుల్ హకీం ఆవేదన వ్యక్తం చేశారు. 'భారతదేశాన్ని ఇష్టపడని కొడుకు నాకొద్దని, వాడి శవాన్ని కూడా నేను చూడను' అని అబ్థుల్ హకీం చెప్పారు. కాలికట్లో 'ఖుర్ ఆన్' చదివేందుకు అని ఇంట్లో నుంచి వెళ్లిన హఫీజుద్దీన్.. ఆ తర్వాత ఉన్నత చదువు కోసం శ్రీలంక వెళుతున్నట్లు చెప్పి వెళ్లాడని హకీం చెప్పారు.
రంజాన్ ఈద్ సందర్భంగా తాను కొడుకు రాక కోసం ఎదురు చూసినా రాలేదని హకీం ఆవేదనగా చెప్పారు. తనను ఎప్పుడూ అబ్బజాన్.. అబ్బజాన్ అని పిలిచే తన కుమారుడు తీవ్రవాదిగా మారాక 'కాఫీర్'(దేవుడిపై నమ్మకం లేని వ్యక్తి) అంటూ పిలిచి తనను తీవ్ర ఆవేదనకు గురిచేశాడని హకీం పేర్కొన్నారు.