ఆ పని చేస్తే నా భార్య నన్ను వదిలేస్తుంది : రఘురామ్ రాజన్
ఢిల్లీ : రాజకీయ అరంగేట్రం గురించి ప్రముఖ ఆర్థికవేత్త, రిజర్వ్ బ్యాంక్ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆసక్తికర విషయాలు చెప్పారు. ఆయన పొలిటికల్ ఎంట్రీపై ఊహాగానాల నేపథ్యంలో క్లారిటీ ఇచ్చారు. తనకు రాజకీయాలపై ఏ మాత్రం ఆసక్తిలేదని స్పష్టం చేశారు. పాలిటిక్స్ కన్నా అకడమిక్స్ అంటేనే తనకు ఇష్టమని రఘురామ్ రాజన్ నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తేల్చిచెప్పారు.
ఇంజిన్ లో సాంకేతిక లోపాలు: వెనక్కి మళ్లిన విమానం: అందులో రాహుల్ గాంధీ!
నా భార్య వదిలేస్తానంది
రాజకీయాల కన్నా తనకు కుటుంబ జీవితమే ముఖ్యమన్నారు రఘురామ్ రాజన్. రాజకీయాల్లోకి వస్తారా అనే ప్రశ్నకు ఒకవేళ తాను పాలిటిక్స్లోకి అడుగుపెడితే తన భార్య కాపురం చేయనని చెప్పిందని నవ్వుతూ సమాధానం ఇచ్చారు. భారత్లో అయినా మరెక్కడయినా రాజకీయాలు ఒకే విధంగా ఉంటాయని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. బలమైన కారణమేమీ లేకపోయినా తనకు రాజకీయాలపై ఆసక్తిలేదని, వాక్చాతుర్యంతో ఓట్లను పొందే నైపుణ్యం తనకు లేదని చెప్పారు.
పాలిటిక్స్ కన్నా అకడమిక్స్ ఇష్టం
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తనకు కేంద్రమంత్రి పదవి వస్తుందన్న ఊహాగానాలపై రఘురామ్ స్పందించారు. తాను ఏ రాజకీయ పార్టీకి మద్దతు ఇవ్వనని స్పష్టం చేశారు. పాలిటిక్స్ కన్నా అకడమిక్స్ అంటేనే తనకు ఎక్కువ ఇష్టమనిఅన్నారు. ఉద్యోగం అంటే తనకు ఇష్టమని, తాను నిర్వర్తిస్తున్న విధులతో సంతోషంగా ఉన్నానని చెప్పారు.
న్యాయ్ పథకంతో సాధికారత
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన కనీస ఆదాయ పధకం న్యాయ్ ద్వారా ఎన్నో లాభాలున్నాయని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు. పేదలకు డబ్బు అందజేయడం ద్వారా వారికి కావాల్సిన వస్తువులు వారే కొనుక్కుంటారని అన్నారు. ఇది ప్రజల్లో సాధికారితను పెంచుతుందని చెప్పారు. సార్వత్రిక ఎన్నికల అనంతరం ఎవరు అధికారంలోకి వచ్చినా సమస్యలే వారికి స్వాగతం పలుకుతాయన్నారు రాజన్. సంస్కరణలు, ఆర్థిక సమస్యల పరిష్కారించే విధానం, ఉపాధి కల్పన తదితర సవాళ్లను ఎదుర్కోవాల్సిందేనని రఘురామ్ రాజన్ అభిప్రాయపడ్డారు.