కరోనావైరస్ వివరాల కోసం వాట్సాప్ నెంబర్: ఈ నెంబర్ ద్వారా పూర్తి సమాచారం తెలుసుకోవచ్చు
కరోనా వైరస్ ప్రపంచ దేశాలన్నింటిని గడగడలాడిస్తోంది. దీనికి మందు లేకపోవడంతో నివారణ పైనే అన్ని దేశాలు ఫోకస్ చేశాయి. వైరస్ సోకకుండా ఉండేందుకు.. సోకిన తర్వాత ఇతరులకు వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వాలు కీలక సలహాలు,సూచనలు చేస్తున్నాయి. ముఖ్యంగా కరోనా లక్షణాలు బయటపడితే.. వెంటనే ఆసుపత్రికి రావాలని సూచిస్తున్నాయి. జ్వరం,నీరసం,పొడి దగ్గు.. వీటిని కరోనా లక్షణాలుగా చెబుతున్నారు. క్రమంగా వీటి తీవ్రత పెరగవచ్చు. వైరస్ సోకిన ఐదు రోజుల తర్వాత ఈ లక్షణాలు బయటపడుతాయి. సాధారణంగా రెండు నుంచి 14 రోజుల పాటు వీటి లక్షణాలు కనిపించవచ్చు.
ఇక కరోనావైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే స్వీయనిర్బంధంలోకి వెళ్లిపోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సూచనలు ఇవ్వడమే కాదు అలర్ట్ కూడా చేస్తున్నారు. ఎప్పటికప్పుడు పరిసరాలను శుభ్రంగా ఉండేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాయి. ఇందులో భాగంగా ప్రతిరోజు రైళ్లల్లో , బస్సుల్లో, మెట్రో రైళ్లల్లో, ఇతర పరిసరాల్లో క్రిమిసంహారక మందును కొడుతున్నారు. ఇక సోషల్ డిస్టెన్సింగ్ మెయిన్టెయిన్ చేయడం ద్వారా కరోనావైరస్కు చెక్ పెట్టొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా సూచించింది.
తాజాగా కరోనావైరస్ గురించి విసృత స్థాయిలో ప్రచారం లేదా అవగాహన కార్యక్రమం చేపడుతోంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే మైగవ్ కరోనా హెల్ప్ డెస్క్ ను ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈ హెల్ప్ డెస్క్ నెంబర్ 9013151515. ఇదే ఫోన్లలో సేవ్ చేసుకుంటే ఈ నెంబర్ ద్వారానే వాట్సాప్ కూడా చేయొచ్చని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యంగా కోవిడ్-19కు సంబంధించిన సమాచారం ఈ వాట్సాప్ నెంబర్ ద్వారా పొందొచ్చంటూ తెలిపింది. అయితే ఈ ఒక్క వాట్సాప్ నెంబర్కు మాత్రమే ప్రభుత్వం పరిమితి కాలేదు. మరో రెండు టోల్ ఫ్రీ నెంబర్లను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రజల సందేహాలకు సమాధానం చెప్పేందుకు ఈ హెల్ప్ లైన్ నెంబర్లను తీసుకొచ్చింది. హెల్ప్ లైన్ నెంబర్ ఇలా ఉంది. +91-11-23978046