మైసూరు నగరంలో విధ్వంసాల కోసం ఏకే 47: పాకిస్థాన్ ఉగ్రవాదికి ఏడేళ్ళు కఠిన శిక్ష!
బెంగళూరు: రాచనగరి మైసూరులో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించిన పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ ఫహాద్ కు మైసూరు ప్రిన్సిపల్ సిటి సివిల్ సెషన్స్ కోర్టు 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విదిస్తూ తీర్పు చెప్పింది.
2006లో మైసూరు నగరంలోని విజయనగర్ లో పోలీసులు నాకాబంధి చేస్తున్నారు. ఆ సందర్బంలో మహమ్మద్ ఫహాద్ బైక్ లో అటు వైపు వచ్చాడు. పోలీసులు బైక్ నిలిపి అతని దగ్గర ఉన్న బ్యాగ్ పరిశీలించారు. ఆ సమయంలో రూ. 50 వేలు (భారత కరెన్సీ) బయటపడింది.
అక్రమంగా నగదు ఎక్కడికి తరలిస్తున్నావు అని పోలీసులు ప్రశ్నించారు. ఆ సందర్బంలో మహమ్మద్ ఫహాద్ తన దగ్గర ఉన్న ఏకే 47 రైఫిల్ తో పోలీసుల మీద కాల్పులు జరిపి పారిపోయాడు. పోలీసులు వెంబడించి మహమ్మద్ ఫహాద్ ను సినిమా ఫక్కీలో పట్టుకుని ఏకే 47 రైఫిల్, రూ. 50 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు.
నిందితుడు పాకిస్థాన్ లోని అల్ బదర్ ఉగ్రవాది అని, అక్కడి నుంచి అక్రమంగా నగదుతో భారత్ ప్రవేశించి మైసూరులో మారుపేరుతో నివాసం ఉంటున్నాడని వెలుగు చూసింది. అక్రమంగా నగదు తీసుకు వచ్చి మైసూరు నగరంలో విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించాడని ఈడీ అధికారులు సైతం కేసు నమోదు చేశారు
పాకిస్థాన్ ఉగ్రవాది మహమ్మద్ ఫహాద్ అక్రమంగా భారత్ లో చొరబడ్డాడని, విధ్వంసాలు సృష్టించడానికి ప్రయత్నించాడని నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడికి 7 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10 వేల రుపాయల జరిమానా విధించిందని మైసూరు నగర పోలీసులు తెలిపారు.