నో బాత్, నో వాష్.. విద్యార్థినులకు సర్క్యులర్.. వివాదంలో మైసూర్ యూనివర్సిటీ
మైసూరు : ఒక అరగంట ట్యాప్ లో నీళ్లు రాకుంటే కాలు గాలిన పిల్లిలా తయారవుతుంది మనుషుల పరిస్థితి. అలాంటిది 3 నెలలుగా నీటి ఇబ్బంది ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించడం కష్టమే. దినచర్యలో భాగంగా నీళ్ల స్థానం ఎంతటి ప్రాధాన్యం సంతరించుకుంటుందో వేరే చెప్పనక్కర్లేదు.
నీటి కొరత ఏర్పడితే సాధారణంగా ఎవరైనా ప్రత్యామ్నాయ పరిష్కారం కోసం ఆలోచిస్తారు. బోరు చెడిపోయినా, కుళాయిలో నీళ్లు రాకున్నా.. అవసరానికి తగ్గట్లుగా వాటర్ ట్యాంకులు తెప్పించుకోవడం చేస్తుంటారు. అయితే నీటి ఎద్దడి సమస్య వస్తే.. మైసూర్ యూనివర్సిటీ తీసుకున్న నిర్ణయం వివాదస్పదమైంది.
కారెక్కనున్న టీడీపీ సీనియర్..! మండవ ఇంటికి కేసీఆర్.. కూతురు గెలుపు కోసమేనా?
3 నెలలుగా సమస్య.. ధర్నా
మైసూరు వర్సిటీలో ఒక్క రోజు కాదు వారం కాదు.. మూడు నెలల నుంచి నీటి కొరత ఉంది. దాంతో హాస్టల్ లో ఉంటున్న విద్యార్థినులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ క్రమంలో నీటి ఎద్దడి కారణంగా మైసూర్ యూనివర్సిటీ వింత సర్క్యులర్ జారీ చేసింది. నీటి వాడకానికి సంబంధించి హాస్టల్ విద్యార్థినులకు నిబంధనలు విధించింది.
స్నానాలు చేయొద్దు.. బట్టలు ఉతకొద్దంటూ ఎక్కడా లేని చిత్ర విచిత్ర నిర్ణయం ప్రకటించింది. దాంతో వర్సిటీ అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థినులు ధర్నాకు దిగారు. మాకు నీళ్లొచ్చేంత వరకు మీరు కూడా స్నానాలు చేయొద్దు, బట్టలు ఉతకొద్దంటూ వర్సిటీ సిబ్బందిని ఉద్దేశించి నినదించారు. అయితే వైస్ వైస్ ఛాన్స్లర్ హేమంత్ కుమార్ స్పందించి వారికి సర్దిచెప్పాలని చూశారు. క్యాంపస్ ప్రాంగణంలోని కొన్ని బోరుబావులు ఎండిపోవడం కారణంగా నీటి కొరత ఏర్పడిందని తెలిపారు. నీటి సమస్య తీర్చడానికి ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
ఎన్ని తిప్పలు
దాదాపు 3 నెలల నుంచి నీటి కొరత ఉండటంతో.. వారానికోసారి మాత్రమే ట్యాంకర్ల ద్వారా నీళ్లు తెప్పిస్తున్నారు. దాంతో రోజువారీ అవసరాల కోసం నీటి పంపుల దగ్గర విద్యార్థులు క్యూ కట్టాల్సిన పరిస్థితి. అవసరాలకు తగ్గట్లుగా నీళ్లు తెప్పించకుండా.. స్నానాలొద్దు, బట్టలు ఉతకొద్దంటూ ఆదేశాలు ఇవ్వడమేంటని విద్యార్థినులు ప్రశ్నిస్తున్నారు.
నీటి కొరత నేపథ్యంలో ఓ స్కాలర్ తన ఆవేదన వెళ్లగక్కారు. ఇదివరకు ఒకసారి రెండు రోజులు కరెంట్ లేదు. ఆ సమస్య గురించి తాము అంత పెద్దగా బాధపడలేదు. కానీ నీటి విషయంలో మాత్రం సహనం నశించిపోతోంది. ఒక బకెట్ నీళ్లతో రోజువారీ అవసరాలు తీర్చుకోవాలంటే ఎలా కుదురుతుంది అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల తర్వాత మోక్షం కలిగేనా?
మైసూర్ యూనివర్సిటీ క్యాంపస్ లో మొత్తం 40 వరకు బోరుబావులు ఉన్నాయి. 65 విభాగాలకు సంబంధించిన వివిధ కోర్సులు అభ్యసించేందుకు 3 వేల మంది విద్యార్థినులు ఇక్కడి హాస్టళ్లల్లో ఉంటున్నారు. అయితే 40 బోరుబావులకు గాను అందులో 10 వరకు పూర్తిగా ఎండిపోయాయి. మరికొన్ని బోరుబావుల్లో తక్కువ నీరు లభిస్తోంది. అయితే వాటర్ సమస్య పరిష్కరించడానికి మైసూర్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులతో మాట్లాడినట్లు చెబుతున్నారు వైస్ ఛాన్స్లర్. యూనివర్సిటీ వరకు పైప్ లైన్ పొడిగించాలని కోరినట్లు చెప్పారు. పార్లమెంటరీ ఎన్నికల నేపథ్యంలో తమ వినతి పత్రం పెండింగ్ పడిందని వివరించారు.