ఆలయంలో గుర్తు తెలియని వస్తువు పేలి మృతి, ఏం జరిగింది ? ఉగ్రవాదులు, బాంబ్ స్వ్కాడ్ !
చెన్నై: దేశంలో ఉగ్రవాదులు చొరబడ్డారని, అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఇంటిలిజెన్స్ అధికారులు ఇప్పటికే హెచ్చరించారు. తమిళనాడులో ముగ్గురిని, కర్ణాటకలోని మంగళూరులో ఓ అనుమానితుడిని పోలీసు అధికారులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తమిళనాడులోని ఓ ఆలయంలో గుర్తు తెలియని వస్తువు పేలి ఓ యువకుడు మరణించాడు.
తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో ఉన్న ఓ ఆలయంలో గుర్తు తెలియని వస్తువు పేలడంతో ఓ వ్యక్తి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. గాయపడిన మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు. కాంచీపురం జిల్లాలోని తిరుపోరూర్ సమీపంలోని మానామది గ్రామంలోని గంగై అమ్మాన్ ఆలయం కొలనులో గత కొన్ని రోజులుగా స్థానిక యువకులు పూడికతీత పనులు చేస్తున్నారు.
పూడికతీత పనులు చేస్తున్న యువకులకు ఆదివారం ఓ పెట్ట చిక్కింది. ఆ పెట్టను ఆ యువకులు పగలగొట్టి తియ్యడానికి ప్రయత్నించారు. ఆ సమయంలో ఆ పెట్టె ఒక్కసారిగా పేలిపోయింది. ఈ పేలుడులో సూర్య, తిరుమాల్, యువరాజ్, దిలీపన్, జయరామ్, బాబు అనే యువకులకు తీవ్రగాయాలైనాయి.
వెంటనే గాయాలైన యువకులను చెంగల్పట్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సూర్య అనే యువకుడు మరణించాడు. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఐదు మంది యువకుల పరిస్థితి విషమంగా ఉందని పోలీసు అధికారులు తెలిపారు.
తమిళనాడు రాష్ట్రంలో ఉగ్రవాదులు చొరబడ్డారని, ఆలయాలను లక్ష్యంగా చేసుకున్నారని అధికారులు హెచ్చరించిన నేపథ్యంలో కాంచీపురం జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. బాంబు నిర్వీర్య దళం అధికారులు, సిబ్బంది గంగై అమ్మాన్ ఆలయం దగ్గరకు చేరుకుని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.