వింత జంతువు దాడిలో మరో 3గొర్రెలు మృతి: భయాందోళనలో ప్రజలు
కటక్ జిల్లా నియాళి ప్రాంతంలో వింత ఆకారం గల జంతువు ఒకటి ఇప్పటిక పదుల సంఖ్యలో గొర్రెల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే.
కటక్: ఒడిశాలోని కటక్ జిల్లా నియాళి ప్రాంతంలో వింత ఆకారం గల జంతువు ఒకటి ఇప్పటిక పదుల సంఖ్యలో గొర్రెల ప్రాణాలు తీసిన విషయం తెలిసిందే. బుధవారం రాత్రి మరో గొర్రె మృతి చెందడంతోపాటు మరికొన్ని గొర్రెలు తీవ్రంగా గాయపడ్డాయి. తాజాగా, గురువారం రాత్రి ఈ జంతువు దాడిలో భరానా గ్రామంలో మరో రెండు గొర్రెలు మృతి చెందాయి.
గొర్రెలే లక్ష్యంగా దాడి..
కాగా, ఈ అడవి జంతువు కేవలం గొర్రెలను మాత్రమే చంపుతున్న విషయం చర్చనీయాంశంగా మారింది. ఈ జంతువు బారిన పడి అనేక గొర్రెలు బలవుతున్న నేపథ్యంలో తమను రక్షించాలని గ్రామస్థులు గురువారం పుల్నఖరా రోడ్డుపై టైర్లు కాల్చి రాస్తారోకో చేపట్టారు. దీంతో ఆ మార్గంలో కొన్ని గంటలపాటు రవాణా స్తంభించింది. ప్రతీ రోజు గొర్రెలను చంపేస్తున్న సంఘటనలు వెనుక దాగివున్న రహాస్యాన్ని పరిష్కరించాలని, మృతి చెందిన గొర్రెల యజమానులకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
మానవాకృతిని పోలిన మేకపోతు!?: ఒడిశాలో గొర్రెలపై భయానక దాడులు.. ఏం జరుగుతోంది!
కాపలా ఉన్నా..
సమాచారం అందుకున్న కటక్ జిల్లా అటవీ అధికారి, నందన్కానన్ జూ ఫీల్డ్ డైరెక్టర్, పోలీసులు.. గొర్రె మృతి చెందిన ప్రాంతానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. రాత్రిపూట గ్రామస్థులు, అటవీశాఖ సిబ్బంది గ్రామంలో కాపలా ఉన్నా బుధవారం రాత్రి మరో గొర్రెను జంతువు చంపేయడంతో ఆందోళన కలిగిస్తోంది. గురువారం రాత్రి కూడా మరో రెండు గొర్రెలు హతమవడంతో ప్రజల్లో భయాందోళన నెలకొంది.
హెచ్చరికలు..
జిల్లా అధికారులు కూడా రాత్రిపూట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని లౌడ్స్పీకర్ల ద్వారా హెచ్చరిస్తున్నారు. ఈ ఘటనపై అటవీశాఖ మంత్రి బిజయ్శ్రీ రౌత్రాయ్ గురువారం మీడియాతో మాట్లాడారు.దాడులకు పాల్పడుతున్న జంతువును పట్టుకునేందుకు అవసరమైన చర్యలు కొనసాగుతున్నాయన్నారు.
హైనా దాడులేనా..
గొర్రెల మృతికి పరిహారం చెల్లించేందుకు ఎలాంటి విధానాలు లేవని, అటవీశాఖ కార్యదర్శి, ఇతర అధికారులతో చర్చించి పరిహారం చెల్లించే విషయమై నిర్ణయం తీసుకుంటామని మంత్రి బిజయశ్రీ తెలిపారు. కాగా, ఈ దాడులు చేస్తున్నది అడవి జంతువు హైనా(దుమ్ములగొండి)నేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి.కాగా, దాడులు జరిగిన పరిసర ప్రాంతంలో గురువారం రాత్రి ఓ హైనా సంచరిస్తున్న వీడియో వెలువడటంతో ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది.