వీడిన మిస్టరీ.. బెంగళూరులో ఆ భారీ వింత శబ్దాలకు కారణమిదే..
బెంగళూరులో బుధవారం మధ్యాహ్నం 1.20గంటల ప్రాంతంలో వినిపించిన భారీ వింత శబ్దాలు నగరవాసులను ఉలిక్కిపడేలా చేశాయి. ఏం జరిగిందో తెలియక జనం కంగారుపడిపోయారు. చాలామంది భూకంపం సంభవించిందేమోనన్న అనుమానంతో బయటకు పరుగులు తీశారు. కానీ అలాంటిదేమీ లేదు. దీంతో ఆ శబ్దాలు ఎక్కడి నుంచి వచ్చాయో తెలియక జనం అయోమయానికి గురయ్యారు. కొంపదీసి ఆ శబ్దం UFO(గుర్తు తెలియని ఎగిరే వస్తువులు)ల నుంచి వచ్చింది కాదు కదా.. అని కొందరు.. గ్రహాంతర వాసుల నుంచి వచ్చిందా అని మరికొందరు సోషల్ మీడియాలో తమ సందేహాలను వ్యక్తపరిచారు. అయితే ఎట్టకేలకు ఈ మిస్టరీ వీడింది.
Recommended Video
బెంగళూరులో భారీ వింత శబ్ధాల కలకలం: భయాందోళనలు, ఏం జరిగిందో?
ఇదీ అసలు కారణం..
ఇండియన్ ఎయిర్ఫోర్స్ రొటీన్ టెస్టుల్లో భాగంగా బుధవారం కూడా ఓ యుద్ద విమానాన్ని గగనతలంపై పరీక్షించారని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ క్రమంలో 36వేల నుంచి 40వేల అడుగుల ఎత్తులో విమానం సూపర్సోనిక్ నుంచి వేగాన్ని తగ్గిస్తూ సబ్సోనిక్ స్పీడ్ను అందుకునే క్రమంలో ఆ శబ్దాలు వచ్చి ఉంటాయని తెలిపింది. ఈ ఘటన జరిగిన సమయంలో బెంగళూరు పరిధికి ఆ విమానం చాలా దూరంలో ఉన్నట్టు పేర్కొంది. విమానం 65వేల కి.మీ నుంచి 80వేల కి.మీ ఎత్తులో ఎగురుతున్నప్పుడు కూడా దాని సోనిక్ బూమ్ శబ్దం వినిపించే అవకాశం ఉందని తెలిపింది.
భయపడ్డ ప్రజలు..
సర్జాపూర్, హెచ్ఎస్ఆర్, వైట్ ఫీల్డ్, హెబ్బాల్ ప్రాంతాల్లో బుధవారం మధ్యాహ్నం భారీ శబ్దాలు వినిపించాయి. దీంతో జనం ఇళ్ల నుంచి పరుగులు చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హెబ్బగోడి వరకు ఆ శబ్దాలు వినిపించాయని స్థానికులు తెలిపారు. భూకంపం వచ్చిందేమోనని భయపడి ఇళ్ల నుంచి పరిగెత్తామన్నారు. భూప్రకంపనలేవీ నమోదు కాలేదని కర్ణాటక రాష్ట్ర విపత్త నిర్వహణ కేంద్రం ప్రకటించడంతో.. మరి ఆ శబ్దాలు ఎక్కడినుంచి వచ్చినట్టు అని చాలామంది అయోమయంలో పడిపోయారు. సోషల్ మీడియాలో చాలామంది తమ సందేహాలను వ్యక్తపరిచారు.
సోషల్ మీడియాలో కుళ్లు జోకులు..
ఇది కచ్చితంగా UFO నుంచి వచ్చిన శబ్దాలే అయి ఉంటాయని కొందరు.. ఏలియన్సే అని మరికొందరు నెటిజెన్స్ అభిప్రాయపడ్డారు. కొందరైతే ఇది ఆన్లైన్లో క్లాసులు వింటున్న విద్యార్థులందరి ఫ్రస్టేషన్ నుంచి పుట్టిన సౌండ్ అని జోక్స్ కూడా వేశారు. మరికొందరు.. 2020లో అడవులు తగలబడ్డాయి,భూకంపాలు వచ్చాయి,భూమికి అతిసమీపంగా ఉల్కలు వచ్చాయి,వైరల్ అంటువ్యాధులు వచ్చాయి.. ఇక ఈ శబ్దాలు విన్న తర్వాత గ్రహాంతరవాసులు కూడా వచ్చేశారని టిక్ పెట్టేసుకోవచ్చంటూ కామెంట్స్ చేశారు. ఇంకొందరైతే.. కరోనా వ్యాక్సిన్ ఇచ్చేందుకే భూమి పైకి గ్రహాంతరవాసులు వచ్చేవారేమో అని జోక్స్ పేల్చారు. మొత్తం మీద బెంగళూరులో శబ్దం ప్రజలను ఎంత అయోమయానికి గురిచేసిందో.. సోషల్ మీడియాలో అంత ఫన్నీ ట్వీట్స్ వచ్చేలా చేసింది.