జస్టిస్ లోయా మృతి కేసు: కేసును విచారణ చేసేందుకు నిరాకరించిన జడ్జీలు...ఏం జరిగుంటుంది..?
షోహ్రబుద్దీన్ బూటకపు ఎన్కౌంటర్ కేసును విచారణ చేస్తున్న బాంబే హైకోర్టు జడ్జి జస్టిస్ లోయా మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. జస్టిస్ లోహియా మృతిపై విచారణ చేపట్టాల్సిందిగా కోరుతూ పిటిషన్ దాఖలు కాగా... ఈ కేసును త్రిసభ్య ధర్మాసనం విచారణ చేయాల్సి ఉంది. అయితే ముగ్గురు జడ్జీలు కేసును విచారణ చేపట్టేందుకు నిరాకరించడంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జస్టిస్ బీహెచ్ లోయాను విషం ఇచ్చి చంపారనే ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో కేసును విచారణ చేపట్టాల్సిందిగా సతీష్ ఉకే అనే న్యాయవాది బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
విచారణ చేసేందుకు నిరాకరించిన జస్టిస్ శుక్రే, మోదక్
ఈ పిటిషన్ బాంబే హైకోర్టులోని నాగ్పూర్ బెంచ్ ముందు సోమవారం విచారణకు రావాల్సి ఉంది. అయితే ఈకేసును విచారణ చేసేందుకు జస్టిస్ ఎస్బీ శుక్రే, ఎస్ఎం మోదక్ నిరాకరించారు. అయితే ఇదే పిటిషన్ బుధవారం కోర్టు ముందుకు వచ్చింది. ఈ సారి జస్టిస్ పీఎన్ దేశ్ముఖ్, జస్టిస్ స్వప్న జోషి ముందుకు వచ్చింది. జస్టిస్ స్వప్న జోషి, జస్టిస్ మోదక్లు కేసును విచారణ చేసేందుకు నిరాకరించారని అయితే ఎందుకు నిరాకరిస్తున్నారో కారణాలు మాత్రం తెలపలేదని కోర్టు వెల్లడించింది.
జస్టిస్ స్వప్న జోషి విచారణ చేసేందుకు ఎందుకు నిరాకరించారు?
జస్టిస్ లోయా మృతిపై ఎలాంటి అనుమానాలు లేవని.. అతన్ని కాపాడేందుకు డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారని గతేడాది ఓ వార్తా పత్రికకు తెలిపారు జస్టిస్ శుక్రే. ఇదిలా ఉంటే తన సహోద్యోగి కూతురి వివాహానికి హాజరయ్యేందుకు నాగ్పూర్ వచ్చిన జస్టిస్ లోయా... అక్కడ రాజ్భవన్ అతిథి గృహంలో జస్టిస్ మోదక్తో కలిసి ఒకే గదిలో ఉన్నారు. 2014 డిసెంబర్ 1న జస్టిస్ లోయా గుండెపోటుతో మృతి చెందారు. ఇది తమకు తెలుసు కాబట్టే జస్టిస్ శుక్రే, జస్టిస్ మోదక్లు పిటిషన్ను విచారణ చేసేందుకు నిరాకరించి ఉంటారని తెలుస్తోంది. కానీ మూడో జడ్జి జస్టిస్ స్వప్న జోషి ఎందుకు నిరాకరిస్తున్నారన్న విషయం పై క్లారిటీ లేదు.
అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన జస్టిస్ ప్రకాష్ తోంబ్రే, అడ్వకేట్ శ్రీకాంత్
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా నిర్దోషిగా తేలిన తర్వాత ఆయన 2015 మార్చిలో అణుశక్తి కమిషన్ ఛైర్మెన్ రత్న కుమార్ సిన్హాను కలిశారని పిటిషనర్ తన పిటిషన్లో పేర్కొన్నారు. రేడియో ధార్మిక ఐసోటోప్లను ఇంజెక్ట్ చేయడం వల్లే జస్టిస్ లోయా మృతి చెందినట్లు రిటైర్డ్ జిల్లా జడ్జి ప్రకాశ్ తోంబ్రే, అడ్వకేట్ శ్రీకాంత్ కందాల్కర్ తనతో చెప్పినట్లు అమిత్ షాకు రతన్ కుమార్ సిన్హా చెప్పారు. ఆ తర్వాత జస్టిస్ ప్రకాష్ తోంబ్రే, అడ్వకేట్ శ్రీకాంత్ కందాల్కర్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఇదే అంశంపై సుప్రీం కోర్టులో పిటిషన్ కూడా దాఖలైంది. అయితే కోర్టు మాత్రం జస్టిస్ లోయా మృతి సహజమరణమే అని తీర్పు వెల్లడించింది.