మైసూరు హనీట్రాప్ కేసు కొత్త మలుపు, పోలీస్ ఇన్స్ పెక్టర్, పోకిరి ఫ్రెండ్స్, ఎస్పీకి యువతి ఫిర్యాదు !
హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన మైసూరు యువతి మాలా కేసు కొత్త మలుపు తిరిగింది. పోకిరీతో కలిసి పోలీస్ ఇన్స్ పెక్టర్ తనను వేధింపులకు గురించి తప్పుడు హనీట్రాప్ కేసు నమోదు చేశారని.
బెంగళూరు: హనీట్రాప్ కేసులో అరెస్టు అయిన మైసూరు యువతి మాలా కేసు కొత్త మలుపు తిరిగింది. పోకిరీతో కలిసి పోలీస్ ఇన్స్ పెక్టర్ తనను వేధింపులకు గురించి తప్పుడు హనీట్రాప్ కేసు నమోదు చేశారని, మీరే న్యాయం చెయ్యాలని మైసూరు జిల్లా పోలీసు కమిషనర్ డి. రవికి బాధితురాలు ఫిర్యాదు చేశారు.
తనను మానసికంగా వేధింపులకు గురిచేసి నిత్యం వేధించిన పోకిరి మనోజ్ అలియాస్ పుట్టస్వామి, మైసూరు సౌత్ రూరల్ లోని నంజనగూడు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ గోపాలకృష్ణ కలిసి తనను తప్పుడు కేసులో ఇరికించారని బాధితురాలు మాలా జిల్లా పోలీసు కమిషనర్ రవికి ఫిర్యాదు చేశారు.
యువతి వెంట పడిన పోకిరి
మనోజ్ తనను వేధించిన సమయంలో రికార్డు చేసిన ఆడియో క్లిప్పింగ్స్ సైతం బాధితురాలు జిల్లా పోలీసు కమిషనర్ కు ఇచ్చారు. మైసూరులోని అశోకపురంలో నివాసం ఉంటున్న మాలా వెంట పడిన మనోజ్ మూడు నెలల క్రితం ఓ హోటల్ లో ఆమెను పరిచయం చేసుకున్నాడు.
ఫోన్ చేసి జల్సాలకు పిలిచాడు
మాలా ఫోన్ నెంబర్ తీసుకున్న అతను అప్పుడప్పుడు ఆమె మొబైల్ కు ఫోన్ చేసి మాట్లాడేవాడు. తరువాత తనకు శారీరక సుఖం ఇవ్వాలని, డబ్బు ఇస్తానని ఆమెను వేధించాడు. మాలా నిరాకరిస్తూ అతన్ని దూరం పెట్టింది. అయినా మనోజ్ నిత్యం వేధించడంతో విసిగిపోయిన మాలా ఆమెను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తికి విషయం చెప్పింది.
పిలిపించి బెండ్ తీశారు
మాలాను పెళ్లి చేసుకుంటున్న వ్యక్తి మనోజ్ ను పిలిపించి చితకబాదేశారు. అనంతరం మనోజ్ ను కువెంపునగర పోలీసులకు అప్పగించడానికి తీసుకు వెలుతున్న సమయంలో తాను ఇక మీదట ఎప్పుడూ ఇలా చెయ్యనని కాళ్లు పట్టుకున్న మనోజ్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు.
పక్కా ప్లాన్ తో యువతి అరెస్టు
నంజనగూడు గ్రామీణ పోలీస్ స్టేషన్ ఇన్స్ పెక్టర్ గోపాలకృష్ణకు, పోకిరి మనోజ్ కు పరిచయం ఉంది. యువతి మీద కక్ష తీర్చుకోవాలని నిర్ణయించిన మనోజ్ గోపాలకృష్ణను కలిసి మాలాను హనీట్రాప్ కేసులో అరెస్టు చెయ్యాలని చెప్పాడు. ఇద్దరూ పక్కా ప్లాన్ వేసి ఆగస్టు 29వ తేదీన మాలాను అరెస్టు చేసి జైలుకు పంపించారు.
జీవితం నాశనం చేశారు
బెయిల్ మీద బయటకు వచ్చిన మాలా ఇప్పుడు జిల్లా పోలీసు కమిషనర్ ను ఆశ్రయించింది. తన జీవితం నాశనం చేశారని, ఇద్దరి మీద కఠిన చర్యలు తీసుకోవాలని బాధితురాలు జిల్లా ఎస్పీ రవికి మనవి చేశారు. మాలా వెంట ఆమె కుటుంబ సభ్యులు వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి న్యాయం చెయ్యాలని మనవి చేశారు.