8వ తరగతి, ఉన్నత విద్యాశాఖ మంత్రి, ప్రభుత్వ కారు వెనక్కి, అజ్ఞాతంలో దేవేగౌడ, ధర్నా !
మైసూరు/బెంగళూరు: శాఖల కేటాయింపులో తనకు అన్యాయం జరిగిందని ఆరోపిస్తూ జేడీఎస్ పార్టీ సీనియర్ నాయకుడు చాముండేశ్వరి నియోజక వర్గం ఎమ్మెల్యే జీటీ. దేవేగౌడ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. 8వ తరగతి వరకు మాత్రమే విద్యాభ్యాసం చేసిన జీటీ. దేవేగౌడ ఉన్నత విద్యాశాఖను ఎలా సమర్థవంతంగా నిర్వహిస్తారు అనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది.
మంత్రులుగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత కర్ణాటక ప్రభుత్వ పరిపాలనా విభాగం అధికారులు మంత్రులకు కొత్తకార్లు అప్పగించారు. జీటీ. దేవేగౌడకు సైతం ప్రభుత్వ కారు ఇచ్చారు. శాఖల కేటాయింపులో అసంతృప్తితో ఉన్న జీటీ దేవేగౌడ శనివారం ప్రభుత్వ కారును అధికారులకు అప్పగించి రహస్య ప్రాంతానికి వెళ్లిపోయారు.
మైసూరు జిల్లాలోని రహస్య ప్రాంతంలో మంత్రి జీటీ దేవేగౌడ ఉన్నారని సమాచారం. మాజీ ప్రధాని హెచ్.డి. దేవేగౌడ, కర్ణాటక ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామికి సైతం జీటీ. దేవేగౌడ అందుబాటులో లేరని జేడీఎస్ వర్గాలు అంటున్నాయి.
మరో వైపు విజయనగరలోని జీటీ. దేవేగౌడ ఇంటి ముందు జేడీఎస్ కార్యకర్తలు శనివారం ధర్నా చేస్తున్నారు. జీటీ. దేవేగౌడ కుమారుడు హరీష్ గౌడ జేడీఎస్ కార్యకర్తలకు నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. జీటీ దేవేగౌడకు ఉన్నత విద్యాశాఖ కేటాయిస్తే చాముండేశ్వరి నియోజక వర్గానికి ఎలాంటి లాభం లేదని, వెంటనే శాఖను మార్చాలని సీఎం. కుమారస్వామిని జేడీఎస్ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.