షాక్: కొడుకు కోసం సదానందకు నోటీసు, నటి పూజలు
బెంగళూరు: నరేంద్ర మోడీ కేబినెట్లోని మంత్రికి పోలీసులు షాకిచ్చారు! నటి, మోడల్ మైత్రేయ కేసులో కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడకు బెంగళూరు ఆర్టీ నగర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. మైత్రేయ కేసు నేపథ్యంలో.. తనయుడు కార్తీక్ గౌడను తీసుకు రావాలని సదానందకు పోలీసులు నోటీసులు జారీ చేశారు.
మైత్రేయ కేసులో మీ తనయుడు కార్తీక్ గౌడను ఇరవై నాలుగు గంటల్లో హాజరుపర్చాలని పోలీసులు ఆ నోటీసులో పేర్కొన్నారు. విచారణాధికారి ముందు కార్తీక్ గౌడను ప్రవేశ పెట్టాలని పేర్కొన్నారు. దీనిని సదానంద నిరాకరించినట్లుగా సమాచారం. దీంతో అధికారులు దీనిని మెయిల్ ద్వారా సదానందకు పంపించినట్లుగా చెబుతున్నారు. అలాగే సదానంద ఇంటి తలుపు పైన కూడా నోటీసు అంటించారు.
మరోవైపు కార్తీక్ గౌడ పైన కేసు పెట్టిన నటి మైత్రేయ తుంకూర్లో ప్రత్యేక పూజలు చేసింది. తనకు ఉన్న సమస్యలు అన్నింటిని తీర్చాలని దేవుడిని కోరుకుంది. తాను సదానంద గౌడ కోడలిగా ఉండేలా తన సమస్యలు తీరాలని, తన కుటుంబ సభ్యులు కూడా అదే కోరుకుంటున్నారని, ప్రత్యేక పూజలు చేసినట్లు మైత్రేయ ఆదివారం విలేకరులతో తెలిపారు. మైత్రేయ తన సోదరి సుప్రియతో కలిసి పూజలు చేశారు.
మైత్రేయ ఘటి సుబ్రహ్మణ్యలో మహాకాళ సర్ప యజ్ఞం చేశారు. ఈ యజ్ఞం చేస్తే పెళ్లి సమస్య, పిల్లల సమస్యలు తీరుతాయని పలువురి నమ్మకం. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ప్రభుత్వం జోక్యం చేసుకోదని, న్యాయస్థానం దృష్టిలో అందరు సమానమేనని చెప్పారు.