టాటాల విశ్వాసం చూరగొంటారా?: గ్రూప్ ను గాడిలో పెడతారా?
సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా 30 ఏళ్ల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో చేరిన నటరాజన్ చంద్రశేఖరన్ ఈనాడు ‘టాటా సన్స్’ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకున్నారు.
ముంబై: సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా 30 ఏళ్ల క్రితం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్)లో చేరిన నటరాజన్ చంద్రశేఖరన్ ఈనాడు 'టాటా సన్స్' చైర్మన్గా బాధ్యతలు స్వీకరించే స్థాయికి చేరుకున్నారు. 2009లో అతి పిన్న వయస్సులో టీసీఎస్ సంస్థకు సీఈవోగా బాధ్యతలు స్వీకరించిన అతి పిన్న వయస్కుడు. అటువంటిది తాజాగా 150 ఏళ్ల చరిత్ర గల టాటా గ్రూపునకు సారథ్యం అంటే కత్తిమీద సాము వంటిదే.
ప్రస్తుత కార్పొరేట్ ప్రపంచంలో సాధారణ ఉద్యోగి నుంచి సంస్థ సారథిగా.. ఆ తర్వాత ఏకంగా గ్రూపు అధిపతిగా నియమితులవడం ఆషామాషీ వ్యవహారమేం కాదు. సన్నిహితులంతా 'చంద్ర' అని ముద్దుగా పిలుచుకునే నటరాజన్ చంద్రశేఖరన్.. టీసిఎస్ను జాతీయ స్థాయిలోనే అత్యధిక మార్కెట్ విలువ గల కంపెనీగా తీర్చిదిద్దడంలో అవలీలగా పలు సవాళ్లను ఎదుర్కొన్నారు.
'టాటాలు లీడ్ చేస్తారు, ఫాలో కారు, అన్నింట్లో మనమే టాప్', కొత్త చెర్మెన్ ఇలా..
అటువంటి వ్యక్తికి టాటా గ్రూప్ అధినేతగా చంద్రశేఖరన్కు కొన్ని సవాళ్లు స్వాగతం పలుకుతున్నాయి. 2013లో రతన్ టాటా స్థానే చైర్మన్గా బాధ్యతలు చేపట్టన సైరస్ మిస్త్రీ.. గ్రూప్ ట్రస్టీల విశ్వాసం.. హానరరీ చైర్మన్ గా రతన్ టాటాతో నిమిత్తం లేకుండా.. సంస్థను తనదైన శైలిలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షి విఫలమయ్యాడు. పలు సంస్థ కోర్ గ్రూపు వాణజ్య లావాదేవీలను తనకు నచ్చిన రీతిలో పరిష్కరిస్తూ ముందుకెళ్లడంతో సమస్యలు ఎదురయ్యాయి. దీని ఫలితంగానే సైరస్ ఉద్వాసనకు గురి కావడం, తిరిగి రతన్ టాటా తాత్కాలిక చైర్మన్ నియమితులు కావడం చకచకా జరిగిపోయాయి. ఫలితంగా టాటా గ్రూపు ప్రస్తుతం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నది.
ఈ నేపథ్యంలో చంద్రశేఖరన్ తనకు ఎదురయ్యే సవాళ్లను ఎలా పరిష్కరిస్తారన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలోనూ ఉంది. టాటా గ్రూపునకు ఆ కుటుంబ వారసుడు కాకుండా బయటివ్యక్తి సారథ్యం వహించనుండటం ఇది మూడోసారి. గతంలో నౌరోజి సక్లత్ వాలా సంస్థ సీఎండీగా పనిచేశారు. 2013లో రతన్ టాటా నుంచి చైర్మన్గా వారసత్వాన్ని అందుకున్న మిస్త్రీ ఒంటెద్దు పోకడలే ఆయనను సాగనంపేందుకు దారి తీశాయి. ఈ పరిస్థితుల్లో రతన్ టాటా వంటి పారిశ్రామిక దిగ్గజం సలహాలు తీసుకుంటూ గ్రూప్ ట్రస్టీల విశ్వాసం చూరగొంటూ వివిధ సంస్థల బలోపేతానికి చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత చంద్రశేఖరన్ భుజస్కందాలపై ఉన్నది.
‘చంద్ర’ జీవితంలో మధురఘట్టం
ప్రతిఏటా టీసీఎస్ ఆదాయం 24 శాతం పెంచుతూ వచ్చిన చంద్రశేఖరన్కు ముంబైలోని ‘టాటా సన్స్' ప్రధాన కార్యాలయం బాంబే హౌస్ కొత్తేమీ కాదు. కాకపోతే చైర్మన్ గా అదే ఆఫీసులో బాధ్యతలు స్వీకరించడటం చంద్రశేఖరన్ కు మరుపురాని మధురఘట్టం. టాటా సన్స్ గ్రూప్ అధిపతిగా ఈ కార్యాలయంలో అడుగు పెట్టిన ‘చంద్ర'.. గ్రూపు సంస్థలన్నీ చూసుకోవాలి. సంస్థల పరిరక్షణకు రక్షణాత్మక వ్యూహం, న్యాయ, చట్టపరమైన ఇబ్బందులు తదితర అంశాలను పరిష్కరించాల్సిన బాధ్యత చంద్రశేఖరన్పై ఉంది. కష్టాల్లో ఉన్న సంస్థలను గట్టెక్కించి, వృద్ధి పథంలో పయనిస్తున్న వాటిని మరింత ముందుకు తీసుకెళ్లాలి. చకచకా వ్యూహాలు అమలు చేయాలి. ఈ క్రమంలో ఎదురయ్యే ఎన్నో సవాళ్లను చాకచక్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా ఆయనపై టాటా ట్రస్టీలు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి. అందుకే ఆయన తన కొత్త బాధ్యతను ఓ బృహత్కార్యమని అభివర్ణించారు. ఎన్ని సవాళ్లు ఎదురైనప్పటికీ తన ప్రత్యేకతను చాటుకుంటానని, పాలనలో తనదైన ముద్ర వేస్తానని ప్రకటించి ఆయన తనలోని ఆశావాహ దృక్పథాన్ని బహిర్గతం చేశారు.
సవాళ్లు ఇవీ...
టాటా గ్రూపు చైర్మన్గా చంద్రశేఖరన్ .. మిస్త్రీ ఘటన తర్వాత పాలనపరమైన అంతరాయాలను తొలగించి గ్రూపు సంస్థల్లో పునరుత్తేజం తేవాలి. వ్యాపార లక్ష్యాల సాధనకు ఉన్నత యాజమాన్యంలో తిరిగి విశ్వాసం నింపాలి. టాటా ట్రస్ట్లు, ట్రస్టీలతో ఆయన ఎలా మెలుగుతారనే విషయం కూడా కీలకమే. గ్రూపు సంప్రదాయాలు, విలువలను పరిరక్షణపైనా ఆయన దృష్టి సారించాలి. ఇవే కాక ఆయన కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంది.
డొకొమాతో లీగల్ ఫైట్
టెలికం రంగంలో టాటా టెలీకమ్యూనికేషన్స్ పూర్తిగా నష్టాల్లో చిక్కుకున్నది. దీనికి తోడు 4జీ ద్వారా రిలయన్స్ జియో విసురుతున్న సవాల్నూ ఎదుర్కోవాలి. ఈ పరిస్థితుల్లో రిలయన్స్ కమ్యూనికేషన్స్తో ఎయిర్ సెల్ విలీనంలో భాగస్వామి అయ్యే అంశాన్ని ‘టాటా టెలీ' పరిశీలిస్తున్నది. ఇక జపాన్ టెలికం సంస్థ ‘డొకొమొ'తో దేశీయంగా, అంతర్జాతీయంగా పలు న్యాయస్థానాల్లో వివాదాలు కొనసాగుతున్నాయి. డొకొమొ తన 26.5 శాతం వాటా వెనుకకు తీసుకునే లక్ష్యంతోనే పిటిషన్లు దాఖలు చేసింది. దీనికి కారణంగా మాజీ చైర్మన్ మిస్త్రీ వైఖరే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఈ సమస్యలన్నింటిని పరిష్కరించి టాటా టెలికమ్యూనికేషన్స్లో సాధారణ పరిస్థితులు నెలకొల్పడం తక్షణ సవాల్.
బ్రిటన్లో నష్టాలు...
కోరస్ కొనుగోలు వైఫల్యం తర్వాత నష్టాల్లో ఉన్న టాటా స్టీల్ ఐరోపా కార్యకలాపాలను నియంత్రణలోకి ఇప్పటికే బ్రిటన్ లోని టాటా స్టీల్స్ ఆస్తుల విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ‘బ్రెగ్జిట్' ప్రభావాన్ని దృష్టిలో ఉంచుకొని అమ్మాల్సిన ఆస్తులు, కొనసాగించాల్సిన ఆస్తులేవి అన్నదీ చంద్రశేఖరన్ నిర్ణయించాల్సి ఉంటుంది.
ఈ కంపెనీపై ఒత్తిళ్లు
జాగ్వార్ లాండ్ రోవర్ విక్రయాలు తగ్గుముఖం పట్టడంతో టాటా మోటార్స్పై ఒత్తిళ్లు కొనసాగుతున్నాయి. ఇక వాణిజ్య వాహనాల విక్రయంపై మిశ్రమ స్పందన లభిస్తున్నది. వీటికి తోడు రతన్ టాటా కలల ప్రాజెక్టు నానో కార్ల తయారీ కొనసాగించాలన్న విషయంపై చంద్రశేఖరన్ నిర్ణయం కీలకం కానున్నది. నానో ప్రాజెక్టు వల్ల దాదాపు రూ.1000 కోట్లకు పైగా నష్టం రావడంతో మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ వీటి తయారీకి ముగింపు పలకాలని భావించిన సంగతి తెలిసిందే. టాటా మోటార్స్లోని అన్ని కార్ల విభాగాలను లాభాల్లోకి తెచ్చే బాధ్యత కూడా ఆయనపై ఉంది.
అంచనాలపై అనిశ్చితి
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్1బీ వీసా చట్టంలో తెస్తున్న మార్పులతో ఖర్చు పెరిగే దేశీయ ఐటీ సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ఒకటి. కనుక హెచ్1బీ వీసా ఆంక్షల ప్రభావం తమపై పడకుండా ఇప్పటికే పూర్తి సన్నద్ధమైనట్లు కంపెనీ ప్రకటించినా ఆందోళన వెంటాడుతూనే ున్నదిది. ఇప్పుడు టీసీఎస్ ఛైర్మన్గానే కాక టాటా సన్స్ అధిపతి హోదాలో చంద్రశేఖరన్ వీసా సమస్యకు ఎలాంటి పరిష్కారం చూపుతారో వేచి చూడాల్సిందే. తాజాగా టీసీఎస్ తన షేర్లను బైబ్యాక్ చేయాలని కూడా నిర్ణయించడం గమనార్హం.
తమిళనాట 1963లో పుట్టుక
తమిళనాడులోని నమక్కల్ సమీపంలోని మోహనూర్లో 1963లో జన్మించిన చంద్రశేఖరన్..తిరుచిలోని రీజనల్ ఇంజినీరింగ్ కాలేజీలో మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ పూర్తి చేశారు. సన్నిహితులందరికి ‘చంద్ర'గా సుపరిచితులైన చంద్రశేఖరన్కు భార్య లలిత, కుమారుడు ప్రణబ్ ఉన్నారు. ఆయన కుటుంబం ప్రస్తుతం ముంబైలో నివసిస్తోంది. ఆయన వ్యక్తిగతంగా ఉత్సాహవంతుడైన ఫొటోగ్రాఫర్ కూడా. మారథాన్ రన్నింగ్పై చాలా ఆసక్తి. ప్రపంచ వ్యాప్తంగా ఆమ్స్టర్డామ్, బోస్టన్, చికాగో, బెర్లిన్, ముంబయి, న్యూయార్క్, స్టాక్హోం, టోక్యో తదితర ప్రాంతాల్లో జరిగిన పలు మారథాన్లలో పాల్గొన్నారు.
ప్రోగ్రామర్గా టీసీఎస్ లో కెరీర్ ప్రారంభం
టీసీఎస్లో సాఫ్ట్వేర్ ప్రోగ్రామర్గా 1987లో చేరిన చంద్రశేఖరన్.. 2007 సెప్టెంబర్ లో బోర్డు సభ్యుడిగా చేరి, సీఓఓగా నియమితులయ్యారు. మరో రెండేళ్లకు 2009 అక్టోబర్లో టీసీఎస్ సీఈఓ, ఎండీగా నియామకమయ్యే నాటికి ఆయన వయస్సు 46 ఏళ్లు. టాటా గ్రూప్లో అతిపిన్న సీఈఓల్లో ఒకరుగా ఈయన చరిత్ర సృష్టించారు. ఆయన సారథ్యంలో టీసీఎస్ 24%వార్షిక వృద్ధిని నమోదుచేస్తూ వచ్చింది. ‘సిటీ గ్రూపు గ్లోబల్ సర్వీసెస్'ను కొనుగోలు చేసి టీసీఎస్ను పురోగతి బాట పట్టించడంలో కీలక పాత్ర పోషించారు. భారత్లోనే అత్యధిక మార్కెట్ విలువ (70 బిలియన్ డాలర్లు లేదా రూ.5 లక్షల కోట్లు) గల కంపెనీగా కూడా టీసీఎస్ 2015-16లో రికార్డు సృష్టించింది. గత మూడేళ్లలో టాటా సన్స్ డివిడెండ్లలో టీసీఎస్ వాటా కనీసం 70 శాతంగా ఉంది. సంస్థలో మహిళల నియామకాల్ని క్రమంగా పెంచుతూ ప్రస్తుతం దేశంలో ఎక్కువమంది మహిళా ఉద్యోగులున్న ఐటీ సంస్థగా టీసీఎస్ను నిలిపారు.