ఉల్లి కష్టాలు: ఆ సంస్థ కొన్ని వేల మెట్రిక్ టన్నుల ఉల్లిని వృథా చేసిందా..?
న్యూఢిల్లీ: ఉల్లి ధరలు కొండెక్కి కూర్చుంటున్నాయి. కిలో ఉల్లి 100 రూపాయలు వరకు ధర పలుకుతోంది. ఇక దేశంలో ఉల్లి కొరత నెలకొనడంతో మోడీ సర్కార్ లక్ష మెట్రిక్ టన్నులను దిగుమతి చేసుకునే పరిస్థితి వచ్చింది. ఉల్లిని దిగుమతి చేసుకునే పరిస్థితి దాపురించగా... ప్రభుత్వ కోఆపరేటివ్ సంస్థ నాఫెడ్ కొన్ని వేలమెట్రిక్ టన్నుల ఉల్లిని వృధా చేసినట్లు జాతీయపత్రిక ప్రింట్ కథనం ప్రచురించింది.
నాఫెడ్ కొన్ని వేల టన్నుల ఉల్లిని వృథా చేసిందా..?
దేశంలో ఉల్లి పంట పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అకాల వర్షాలతో పంటనష్టం కాగా.. ఉన్న ఉల్లి ధరలు అమాంతం కొండెక్కి కూర్చున్నాయి. ఈ క్రమంలోనే కేంద్రప్రభుత్వం ఉల్లిని దిగుమతి చేసుకుంటోంది. అయితే ప్రభుత్వరంగ కోఆపరేటివ్ సంస్థ నేషనల్ అగ్రికల్చర్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఉల్లిని నిల్వ చేసింది. అయితే సరైన పద్ధతిలో నిల్వ చేయకపోవడంతో అవి పాడవగా వృథా అయ్యాయని ది ప్రింట్ కథనంలో పేర్కొంది. ధరల స్థిరీకరణ నిధుల కింద నాఫెడ్ 57,372 మెట్రిక్ టన్నుల ఉల్లిని మహారాష్ట్ర, గుజరాత్లలో నిల్వ ఉంచింది.
ఎందుకూ పనికిరాకుండా పోయిన 53శాతం ఉల్లి
నిల్వ ఉంచిన మొత్తంలో 26,700 మెట్రిక్టన్నులను మాత్రమే బయటకు పంపింది. కిలో ఉల్లి ధర రూ.40 మార్క్ తాకగానే ఆగష్టు నుంచి ఈ నిల్వ ఉన్న ఉల్లిని బయట రాష్ట్రాలకు సరఫరా చేసింది. ఇక మిగిలి ఉన్న ఉల్లిని స్థానిక మార్కెట్లకు పంపగా అవి తక్కువ నాణ్యత కలిగి ఉండటం వల్ల పడివేయాల్సి రాగా.. మరికొన్ని వర్షం, తేమ అలుముకోవడంతో పాడయ్యాయి. మొత్తం మీద 53శాతం ఉల్లిని నాఫెడ్ నిల్వ చేయగా అది ఎందుకూ పనికి రాకుండా పోయింది వినియోగదారుల శాఖలోని అధికారులు వెల్లడించినట్లు ప్రింట్ కథనంలో ప్రచురించింది.
వాతావరణమే కారణమంటున్న అధికారులు
వాతవరణం సరిగ్గా లేకపోవడంతోనే నిల్వ చేసిన ఉల్లి పాడైపోయిందని చెప్పారు ప్రభుత్వం తరపున నాఫెడ్కు నామినేట్ అయిన అభ్యర్థి అశోక్ ఠాకూర్. సాధారణ వాతావరణ పరిస్థితుల్లోనే తాము ఉల్లిని నిల్వ చేస్తామని చెప్పిన ఆయన అది కూడా ఒక నెల లేదా రెండు నెలల వరకే ఉంచుతామని చెప్పినట్లు ప్రింట్ పేర్కొంది. ఒక నెలలో 10శాతం ఉల్లి పాడైందని ఇక రెండు మూడు నెలలు దాటి నిల్వ ఉంచడంతో 25శాతం ఉల్లి పాడైందని చెప్పారు.అధిక వర్షాలు కురుస్తుండటంతోనే తాము నవంబర్ నెల వరకు ఉల్లిని నిల్వ చేయాల్సి వచ్చిందని చెప్పిన అశోక్ ఠాకూర్... సాధారణంగా సెప్టెంబర్ అక్టోబర్ నెలవరకే ఉంచుతామని చెప్పారు. అయితే ఈసారి కోల్డ్ స్టోరేజీలో ఉల్లిని నిల్వ ఉంచలేదని చెప్పారు.
తక్కువ ధరకే ఉల్లి అమ్మకాలు
ఉల్లి కష్టాలు నాఫెడ్ను వదల్లేదు. ఒక్క నిల్వ విషయంలోనే ఈ కష్టాలు పరిమితం కాలేదు. మహారాష్ట్ర గుజరాత్ రాష్ట్రాల నుంచి కేజీ ఉల్లి సగటున రూ.12.5కు కొనుగోలు చేయగా రాష్ట్రాలకు మాత్రం తక్కువ ధరకే అంటే కిలో రూ.15.50కే అమ్మాల్సి వచ్చింది. కిలో ఉల్లిని రూ.24 కంటే ఎక్కువగా అమ్మకూడదని మోడీ సర్కార్ హుకూం జారీ చేసింది. ఉల్లి కొనుగోలు మరియు అమ్మకాల్లో నాఫెడ్ ఖజానాకు విపరీతమైన నష్టాలు వచ్చినట్లు ఓ అధికారి చెప్పినట్లు ప్రింట్ తన కథనంలో రాసుకొచ్చింది.
నాఫెడ్ ఖజానాకు నష్టం
మండీల్లో ఉల్లి ధర కిలో రూ.10 ఉండగా నాఫెడ్ వాటినుంచి రూ.12 చెల్లించి కొనుగోలు చేసింది. ఇక రవాణా ఛార్జీలు కిలోకు రూ.5 నుంచి రూ.8 చెల్లించింది. కానీ అమ్మడం మాత్రం కిలో రూ.15తో అమ్మిందని అధికారి చెప్పినట్లు ప్రింట్ రాసింది. ఇక నాఫెడ్ వద్ద ప్రస్తుతం 60 నుంచి 80 మెట్రిక్ టన్నుల ఉల్లి మాత్రమే మిగిలి ఉన్నట్లు ఆ అధికారి చెప్పినట్లు ప్రింట్ కథనంలో ప్రచురించింది.