నాగా బెటాలియన్ మహిళల సత్తా తెలుసంటూ ఆనంద్ మహీంద్ర: ఏం చేశారంటే..(వీడియో)
కోహిమ: మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్ర సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆసక్తికరమైన ఫొటోలను, వీడియోలను ట్వీట్లు చేస్తుంటారు. తాజాగా, అలాంటిదే ఓ వీడియోను పోస్టు చేసి, దానికి ఓ సరదా వ్యాఖ్యను కూడా జత చేశారు. దీంతో నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు.
నాగా బెటాలియన్ మహిళలు
రోడ్డు పక్కన ఓ గుంతలో ఇరుక్కుపోయిన మహీంద్ర బొలెరో వాహనాన్ని నాగాలాండ్ బెటాలియన్కు చెందిన కొందరు మహిళా పోలీసులు బయటకు తీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీంతో ఆ వీడియోను ఆనంద్ మహీంద్ర తన ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ చేశారు.
కాశ్మీర్లో ఉగ్ర కుట్ర: సరిహద్దులో 100మంది ఉగ్రవాదులు, పాక్ కమాండోలు
సాయం చేశారు
బురదలో ఇరుక్కుపోయి వాహనం బయటకు రాకపోవడంతో వాహనంలోని వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అసలే అడవి కావడంతో జన సంచారం తక్కువ. వచ్చిన వాళ్లు కూడా సాయం చేయకుండా వెళ్లిపోతున్నారు. చివరకు ఈ మహిళా పోలీసులు వచ్చి సాయం అందించారు.
నెటిజన్ల ప్రశంసలు..
మహిళా పోలీసులంతా కలిసి ఆ వాహనాన్ని బయటికి తీయడంతో వాహనంలోని వారంతా ఊపిరి పీల్చుకున్నారు. వాహనాన్ని బయటకు తీసేటప్పుడు కొందరు వీడియో తీశారు. ఆ వీడియోనే వైరల్గా మారింది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల ప్రశంసలందుకుంటోంది.
వారి సత్తా తెలుసంటూ..
ఇక ఆనంద్ మహీంద్ర ఈ వీడియోను పోస్టు చేస్తూ.. ‘బొలెరో వాహనం అక్కడెలా కూరుకుపోయిందో తెలియదు. కానీ, దాన్ని బయటకు తీసినందుకు మహిళా పోలీసులకు ధన్యవాదాలు. వారితో తలపడాల్సి వస్తే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకుంటాను. ఎందుకంటే వారి సత్తా నాకు తెలుసు' అని వ్యాఖ్యానించారు. దీంతో నెటిజన్లు కూడా తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు.
కేంద్రమంత్రి ప్రశంస
రీట్వీట్లు, షేర్లు చేయడంతో మరింత వైరల్గా మారింది. నాగా బెటాలియన్ మహిళా పోలీసుల శక్తి ఏమిటో చూడండంటూ కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేసి ప్రశంసించారు. వాహనం డ్రైవర్ మరింత జాగ్రత్తలు తీసుకుంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు.