ఎన్నికల ముందు రాహుల్కు షాక్: బీజేపీలోకి నాగాలాండ్ మాజీ సీఎంతోపాటు 12మంది నేతలు
కోహిమా: నాగాలాండ్ రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. మాజీ ముఖ్యమంత్రి కేఎల్ చిషితోపాటు కాంగ్రెస్ కీలక నేతలు ఆ పార్టీకి రాజీనామా చేసి భారతీయ జనతా పార్టీలో చేరారు.
కాగా, ఈ ఏడాది మార్చిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాహుల్ గాంధీ ఏర్పాటు చేసిన ఎనిమిది మందితో కూడిన సమన్వయ కమిటీలో కేఎల్ చిషి కూడా సభ్యుడు కావడం గమనార్హం.
బీజేపీలోకి మాజీ సీఎంతోపాటు
బీజేపీ ప్రధాన కార్యదర్శి, ఈశాన్య రాష్ట్రాల ఇంఛార్జ్ రామ్ మాధవ్ ఆధ్వర్యంలో దీమాపూర్లో జరిగిన కార్యక్రమంలో చిషితోపాటు 12మంది బీజేపీలో చేరారు. ఇందులో పలువురు మాజీ ఎమ్మెల్యేలతోపాటు స్వతంత్ర మాజీ ఎమ్మెల్యే జకోబ్ జిమోమి కూడా ఉన్నారు.
మోడీ వల్లే..
ప్రధాని నరేంద్ర మోడీ ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి కట్టుబడి ఉన్నారని, ఆయన చేస్తున్న అభివృద్ధి పనులను చూసే తాము బీజేపీలో చేరామని మాజీ సీఎం చిషి తెలిపారు. రామ్ మాధవ్ చెప్పినట్లుగా.. ఈ ఎన్నికలే నాగాలాండ్ సమస్యలకు పరిష్కారం చూపగలవని అన్నారు.
ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి..
తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, బీజేపీలో చేరానని జకోబ్ జిమోమి చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రధాని మోడీ ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. ఇంతకుముందు ఈయన నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్-బీజేపీ నేతృత్వంలోని టీఆర్ జీలియంగ్ ప్రభుత్వానికి మద్దతునిచ్చారు.
బీజేపీతోనే నాగాలాండ్ అభివృద్ధి, శాంతి
ఈ సందర్భంగా నాగాలాండ్ బీజేపీ అధ్యక్షుడు విసాసోలీ లాంగువు మాట్లాడుతూ.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి రాష్ట్రంలోని ఇతర పార్టీల ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారని చెప్పారు. నాగాలాండ్ అభివృద్ధి, శాంతి కోరుకునేవారే బీజేపీలో చేరుతున్నారని తెలిపారు.