ఆవేశం, గిలానీకి భారతరత్న!: నాలుక్కర్చుకున్న నగ్మా
లక్నో: ప్రముఖ సినీ నటి, ఉత్తర ప్రదేశ్ మీరట్ లోకసభకు పోటీ చేస్తున్న కాంగ్రెసు అభ్యర్థి నగ్మా ఆవేశంలో మాట్లాడి.. ఆ తర్వాత నాలుక్కర్చుకున్నారు. ఆమె రాంపూర్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి తరఫున ప్రచారం చేశారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నేత గిరిరాజ్ చేసిన పాకిస్తాన్ వ్యాఖ్యలపై మాట్లాడాలనుకున్నారు. మోడీని వ్యతిరేకించే వారంతా ఎన్నికల తర్వాత పాకిస్తాన్ వెళ్లిపోవాల్సిందేనని ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
దీనిపై నగ్మా స్పందించాలనుకొని ఆవేశపడ్డారు! ఆయన వ్యాఖ్యలను ఖండించే క్రమంలో కొంత అజ్ఞానం ప్రదర్శించి చిక్కుల్లో పడ్డారు. ఆమె కాశ్మీర్ వేర్పాటువాద ఉద్యమ నాయకుడు సయ్యద్ అలీషా గిలానీకి భారతరత్న ఇచ్చేశారు.
భారతరత్న బిరుదు పొందిన సయ్యద్ అలషా గిలానీ దేశంలో ఒక బాధ్యతాయుతమైన పౌరుడు అని, గిరిరాజ్ మాటల ప్రకారం ఇప్పుడు గిలానీని కూడా పాకిస్తాన్ పంపించేస్తారా అని ఆవేశంగా ప్రసంగించారు. కాశ్మీర్లో విభజనవాది హురియత్ సంస్థ నాయకుడు గిలానీని ఆమె భారతరత్నతో సంభోదించడంతో అందరూ అవాక్కయ్యారు. సభ ముగిశాక తాను తప్పులో కాలేసినట్లు ఆమె గ్రహించారు.
గిరిరాజ్ సభలపై ఈసి నిషేధం
మోడీకి ఓటు వేయని వారిని పాకిస్తాన్ పంపేస్తామంటూ వివాదాస్పద ప్రకటన చేసిన బిజెపి నాయకుడు గిరిరాజ్ సింగ్పై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. బీహార్, జార్ఖండ్లలో జరిగే ప్రచారంలో మాట్లాడకుండా ఆయనపై మంగళవారం నిషేధం విధించింది. దీనితో పాటు ఆయనకు షోకాజ్ నోటీసు కూడా జారీ చేసింది. గిరిరాజ్ సింగ్ ఎలాంటి బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఈ రెండు రాష్ట్రాల జిల్లా అధికారులకు ఈసి వర్తమానం పంపింది. ఆయన ప్రకటనపై దాఖలైన ఎఫ్ఐఆర్పై త్వరితగతిన విచారణ జరిపి దాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని రెండు ప్రభుత్వాలను ఆదేశించింది.