Jyotiraditya Scindia: ఒక్కరే కాదంటూ సచిన్ పైలట్ కామెంట్స్పై నగ్మా ఘాటుగా..
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా భారతీయ జనతా పార్టీలో చేరడం కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతోంది. రాష్ట్రంలో పార్టీని అధికారం తీసుకురావడంలో కీలక వ్యవహరించిన సింధియాను కాంగ్రెస్ పార్టీ తగిన విధంగా గౌరవించలేదని, పార్టీ వీడుతుంటే కనీస ఆపే ప్రయత్నం కూడా చేయలేదని అధిష్ఠానంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జ్యోతిరాదిత్య సింధియా పార్టీ వీడటంపై సచిన్ పైలట్
ఈ నేపథ్యంలో రాజస్థాన్ కాంగ్రెస్ కీలక నేత, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్, మరో నేత నగ్మా మధ్య చోటు చేసుకున్న చర్చ ఆసక్తికరంగా మారింది. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటం దురదృష్టకరమని సచిన్ పైలట్ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. పార్టీలో అన్ని సమస్యలు పరస్పర సహకారంతో త్వరలోనే పరిష్కారం అవుతాయని ఆయన ఆకాంక్షించారు.
సచిన్ పైలట్ వ్యాఖ్యలను తోసిపుచ్చిన నగ్మా
సచిన్ పైలట్ ట్వీట్పై నగ్మా కొంచెం ఘాటుగానే స్పందిస్పందించారు. జ్యోతిరాదిత్య సింధియా రాజీనామా కాంగ్రెస్ పార్టీలోని అసమ్మతి నేతలకు మార్గం సుగమం చేసిందని అన్నారు. జ్యోతిరాదిత్య సింధియా పార్టీని వీడటంపై సచిన్ పైలట్ చేసిన వ్యాఖ్యలను ఆమె తోసిపుచ్చారు.
సింధియా అందుకే వీడారంటూ నగ్మా..
కాంగ్రెస్ పార్టీలో చాలా మంది నేతలు అసంతృప్తితోనే ఉన్నారని, దాన్ని కనిపెట్టడంలో పార్టీ విఫలమైందని నగ్మా తీవ్రంగా స్పందించారు. పార్టీ కోసం నిరంతరం పనిచేసినా సరైన గుర్తింపు లభించకపోవడం కారణంగానే సింధియా కాంగ్రెస్ పార్టీని వీడారని చెప్పారు. మరికొంత మంది అసమ్మతి నాయకులు కూడా పార్టీని వీడే అవకాశం ఉందని నగ్మా అభిప్రాయపడ్డారు.
కాషాయ దళంలో సింధియా..
కాగా, బుధవారం జ్యోతిరాదిత్య సింధియా బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఈ పరిణామం జరిగిన వెంటనే మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి రాజ్యసభ అభ్యర్థుల జాబితాలో బీజేపీ తరపున ఆయన పేరు ప్రకటించడం జరిగింది. మంగళవారం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయన బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో కమల దళంలో చేరారు. అంతకుముందు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షాలతో జ్యోతిరాదిత్య సింధియా భేటీ అయ్యారు. కాంగ్రెైస్ పార్టీలో ఉంటే ప్రజా సేవ చేయడం సాధ్యం కాదని, అందుకే ఆ పార్టీని వీడుతున్నట్లు సింధియా వ్యాఖ్యానించారు. కాగా, సింధియాకు మద్దతుగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 22 మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. మార్చి 16న జరిగే బలపరీక్షలో బలం నిరూపించుకోకపోతే.. అక్కడ అత్యధిక స్థానాలు కలిగిన బీజేపీ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది.