రజనీకాంత్ రావాలని..: భాషాను కలిసిన నగ్మా, అదే దారిలో బీజేపీకి ఝలక్
అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ను కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నది తెలియరాలేదు.
చెన్నై: అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, నటి నగ్మా ఆదివారం సూపర్ స్టార్ రజనీకాంత్ను కలిశారు. ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛంతో సత్కరించారు. వారిద్దరు ఏం మాట్లాడుకున్నది తెలియరాలేదు.
మర్యాదపూర్వకంగానే రజనీకాంత్ను కలిసినట్లు నగ్మా వెల్లడించారని చెబుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీపై తీవ్రస్థాయిలో మండిపడిన మరుసటి రోజే నగ్మా.. రజనీని కలవడం గమనార్హం.
రజనీకాంత్పై స్వామి సంచలనం, మాల్యా అరెస్ట్ ఆరంభమే, నెక్స్ట్ టార్గెట్..
రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని డిమాండ్ పెరుగుతోంది. మరోవైపు ఆయన కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో నగ్మా కలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.
ఆయన రాజకీయాల్లోకి వస్తే మంచిది
రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే చాలా బాగుంటుందని నగ్మా అభిప్రాయపడ్డారు. రజనీకాంత్ రాజకీయాల్లోను విజయవంతం అవుతారని ఆమె అన్నారు. రజనీకాంత్ నుంచి చాలామంది ప్రజలు, అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారని తెలిపారు. ఆయన సినిమాల్లో విజయవంతమైనట్లే రాజకీయాల్లోను అవుతారని చెప్పారు. తద్వారా రజనీకాంత్ రాజకీయాల్లోకి రావాలని ఆమె కోరుకుంటున్నారు. కాగా, తమది స్నేహపూర్వక భేటీ అని నగ్మా చెప్పారు.
బీజేపీ దారిలోనే దెబ్బ కొట్టిందా?
రజనీకాంత్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయినప్పటికీ తమిళనాట ఆయన ద్వారా సొమ్ము చేసుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తోంది. 2014లో మోడీ కలవడం, ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల సమయంలో బీజేపీ అభ్యర్థి కలిశారు. ఇప్పుడు నగ్మా ద్వారా కాంగ్రెస్ పార్టీ కూడా అదే ఎత్తుగడ వేసి.. బీజేపీకి షాకిచ్చిందని అంటున్నారు. రాజకీయాల్లో రజనీకి ఆసక్తి లేనప్పటికీ బీజేపీ దారిలోనే కాంగ్రెస్ ముందుకు వెళ్లడం గమనార్హం.
నగ్మా ద్వారా పావులు కదుపుతోందా?
నగ్మా - రజనీకాంత్లు భాషా సినిమాలో జోడీగా నటించారు. అది సూపర్ డూపర్ హిట్ సినిమా. ఇప్పుడు అదే నగ్మాతో కాంగ్రెస్ పార్టీ రాయబారం నెరపుతోందా అనే చర్చ కూడా సాగుతోంది. రజనీ రాజకీయాల్లోకి రాకున్నప్పటికీ.. ఆయన ఎప్పుడు ఓ చర్చ అవుతున్నారు. జయలలిత మృతి అనంతరం అందరు ఆయన వైపు చూస్తున్నారు. ఏదైనా అవకాశం ఉంటే... అనే ఆలోచనతో కాంగ్రెస్ కూడా నగ్మా ద్వారా చక్రం తిప్పే ప్రయత్నాలు చేస్తుండవచ్చునని అంటున్నారు.
2014లో నాటి ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ.. రజనీకాంత్ను కలిశారు.
ఇటీవల ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి.. రజనీని కలిసి ఆయన మద్దతు తనకు ఉందని చెప్పారు. కానీ రజనీ మాత్రం తన మద్దతు ఎవరికీ లేదని తేల్చి చెప్పారు. అంతేకాదు, రాష్ట్రపతి ఎన్నికల్లో రజనీని నిలబెట్టాలని బీజేపీలో చర్చ జరుగుతున్నట్లుగా కూడా వార్తలు వచ్చాయి. తద్వారా ఆయన ఇమేజ్ సొంతం చేసుకోవాలని భావిస్తోంది.
నగ్మా భేటీ ప్రాధాన్యత ఎందుకంటే..
రజనీకాంత్ను తమ వైపుకు తిప్పుకోవాలని ఇప్పటికే బీజేపీ చూస్తోంది. ఆయన రాజకీయాల్లోకి రాకపోయినప్పటికీ.. ఆయన మద్దతు కోసం అన్ని పార్టీలు ఎదురు చూస్తుంటాయి. జయ మృతి తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావాలని పోస్టర్లు వెలువడుతున్నాయి. ఆయన చుట్టూ రాజకీయ చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో నగ్మా కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది.