రేప్, మతమార్పిడి: నగ్మాకు బీజేపీపై కోపమొచ్చింది
లక్నో: ప్రముఖ నటి, కాంగ్రెసు పార్టీ మహిళా నేత నగ్మా బుధవారం మీరట్ అత్యాచార బాధితురాలిని ఆసుపత్రిలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె భారతీయ జనతా పార్టీ పైన నిప్పులు చెరిగారు. ఘజియాబాద్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని ఆమె పరామర్శించారు.
అనంతరం బీజేపీ తీరును ఎండగడ్డారు. ఈ సంఘటనకు బీజేపీ మతం రంగు పులమాలని చూస్తోందని ఆరోపించారు. రెండు మతాల మధ్య చిచ్చు పెట్టేందుకు ఏ పార్టీకి అవకాశం ఇవ్వరాదని ఆమె అన్నారు. నేరగాళ్ళకు మతం ఉండదని, వారిని నేరగాళ్ళుగానే పరిగణించాలన్నారు.
మరోవైపు, హిందూ జాగారన్ మంచ్ కార్యకర్తలు పలువురు అంతకుముందు వచ్చి బాధితురాలిని పరామర్శించారు. కమిషనర్ ఫర్ ఉమెన్ జరీనా ఉస్మాని కూడా బాధితురాలిని పరామర్శించారు.
కాగా, మీరట్ జిల్లాలోని ఖర్ఖౌదా ప్రాంతంలో ఇరవై ఏళ్ళ మహిళను కొందరు బలవంతంగా ఎత్తుకెళ్ళి, రేప్ చేసి, మతమార్పిడికి పాల్పడిన నేపథ్యంలో ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. బాధితురాలు ఘజియాబాదులోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.