పుట్టినరోజు విషాదం: డ్యాంలో ఒకరు మృతి, 7గురు గల్లంతు, సెల్ఫీ వీడియోలో ఇలా!
మహారాష్ట్రలోని నాగ్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహారయాత్రకు కలమేశ్వర్ ప్రాంతంలోని వేనా డ్యాంకు వెళ్లారు.
నాగ్పూర్: మహారాష్ట్రలోని నాగ్పూర్లో విషాద ఘటన చోటుచేసుకుంది. పుట్టిన రోజు వేడుకల్లో భాగంగా విహారయాత్రకు కలమేశ్వర్ ప్రాంతంలోని వేనా డ్యాంకు వెళ్లారు. కాగా, డ్యాంలో వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా.. ఏడుగురు గల్లంతయ్యారు.
పుట్టినరోజు వేడుకల కోసం..
వివరాల్లోకి వెళితే.. నాగ్పూర్కు చెందిన ఎనిమిది మంది విద్యార్థులు.. ఆదివారం వేనా డ్యామ్కు వెళ్లారు. సాయంత్రం సమయంలో ముగ్గురు బోట్ సిబ్బందితో కలిసి రైడింగ్ చేశారు. బోట్లో షికారు చేస్తున్న సమయంలో వారంతా సెల్ఫీ వీడియో తీసుకున్నారు. అందులోని వ్యక్తి ఆ వీడియోను ఫేస్బుక్లో పోస్టు చేశాడు.
కొద్దిసేపటికే పడవ మునక
ఆ తర్వాత కొద్ది సేపటికే వారు ప్రయాణిస్తున్న బోటు ప్రమాదవశాత్తు ముగినిపోయింది. దీంతో బోటులోని వారంతా గల్లంతయ్యారు. ఇది, గమనించిన స్థానికులు.. ఇద్దరు బోట్ సిబ్బంది, ఒక విద్యార్థిని రక్షించారు.
ఏడుగురు గల్లంతు
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. ఇప్పటివరకు ఒక మృతదేహాన్ని గుర్తించగా.. మరో ఏడుగురు గల్లంతైనట్లు పోలీసులు తెలిపారు.వీరిలో సోమవారం సాయంత్రం వరకు మరో ఐదుగురి మృతదేహాలను బయటికి తీశారు.
ముమ్మర గాలింపు
ఆదివారం సాయంత్రం నుంచి గజ ఈతగాళ్లతో కూడిన రెండు బృందాలు ఇక్కడ గాలింపు చేపట్టాయని నాగ్పూర్ రూరల్ అదనపు ఎస్పీ సురేశ్ భోయత్ తెలిపారు. అయితే పడవ ఎలా మునిగిందన్నదానిపై ఇంకా స్పష్టత రాలేదని చెప్పారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.