తల్లి చివరి చూపులకే కాదు.. కర్మకాండలకూ ఒప్పుకోని హైకోర్టు: ప్రొఫెసర్ సాయిబాబా పెరొల్పై!
నాగ్పూర్: ఢిల్లీ యూనివర్శిటీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా దాఖలు చేసిన అత్యవసర పెరొల్ పిటీషన్ మరోసారి తిరస్కరణకు గురైంది. ఆయన దాఖలు చేసిన పెరొల్ పిటీషన్ను బోంబే హైకోర్టు నాగ్పూర్ బెంచ్ కొట్టేసింది. పెరోల్ ఇవ్వలేమని స్పష్టం చేసింది. తన తల్లి కర్మకాండలను నిర్వహించడానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ సాయిబాబా అత్యవసర పెరొల్ కోసం దాఖలు చేసిన పిటీషన్పై కొద్దిసేపటి కిందట నాగ్పూర్ బెంచ్ విచారణ చేపట్టింది. అనంతరం దాన్ని కొట్టి వేసింది. తల్లి అంత్యక్రియలను నిర్వహించడానికీ అనుమతి ఇవ్వలేదు. కర్మకాండలను నిర్వహించడానికీ ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
45 రోజుల తాత్కాలిక బెయిల్ కోసం..
జీఎన్ సాయిబాబా తల్లి గోకరకొండ సూర్యవతి ఇటీవలే కన్నుమూసిన విషయం తెలిసిందే. సుదీర్ఘకాలం పాటు కేన్సర్తో బాధపడిన సూర్యవతి హైదరాబాద్లోని నిజాం వైద్య విజ్ఙాన సంస్థలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కేన్సర్తో బాధపడుతున్న తల్లిని చూడటానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ సాయిబాబా 45 రోజుల తాత్కాలిక బెయిల్ కోసం దరఖాస్తు చేశారు. దాన్ని నాగ్పూర్ బెంచ్ తిరస్కరించింది. ఆ తరువాత కూడా ఆయన బెయిల్ కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ.. ఫలించలేదు.
కంటైన్మెంట్ జోన్లో ఉన్నందున..
కరోనా వైరస్ కంటైన్మెంట్ జోన్లో సాయిబాబా తల్లి నివసిస్తున్నందున బెయిల్ ఇవ్వకూడదంటూ అప్పట్లో స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రశాంత్ శతనాథన్ వాదించారు. కేంద్రం అమలు చేస్తోన్న కోవిడ్ నిబంధనల ప్రకారం.. కంటైన్మెంట్ జోన్లో బయటి వ్యక్తులు వెళ్లడానికి అనుమతి లేదని చెప్పారు. సాయిబాబా కూడా కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఉందని, ఆయన మళ్లీ జైలుకు వస్తే.. ఖైదీలకూ సోకుతుందంటూ వాదించారు. ఆయన వాదనలతో ఏకీభవించిన బెంచ్.. బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. తల్లి కన్నుమూసిన తరువాత కూడా బెయిల్ లభించలేదు.
కర్మకాండలను నిర్వహించడానికీ..
తల్లి అంత్యక్రియల్లో పాల్గొనడానికి అవకాశం ఇవ్వాలంటూ ఆయన మరోసారి న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అప్పుడు కూడా పిటీషన్ను తిరస్కరించింది న్యాయస్థానం. బోంబే హైకోర్టులో కూడా బెయిల్ పిటీషన్ దాఖలు చేసినా ఫలితం లేకుండా పోయింది. తాజాగా కర్మకాండలను నిర్వహించడానికైనా అనుమతి ఇవ్వాలంటూ సాయిబాబా తరఫు న్యాయవాది ఆకాశ్ సోర్డే పెరోల్ పిటీషన్ దాఖలు చేశారు. మానవతా దృక్పథంతో సాయిబాబాకు అత్యవసర పెరొల్ను మంజూరు చేయాలంటూ అభ్యర్థించారు. ఈ పిటీషన్లను కూడా నాగ్పూర్ బెంచ్ కొట్టేసింది.
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో..
మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలతో ఆరేళ్ల కిందట సాయిబాబాను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఆరోపణలు రుజువు కావడంతో 2017 మార్చిన మహారాష్ట్రలోని గడ్చిరోలి న్యాయస్థానం సాయిబాబాకు యావజ్జీవ కారాగార శిక్షను విధించింది. దీన్ని సవాల్ చేస్తూ ఆయన బోంబే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక యాక్ట్ (యూఏపీఏ) కింద సాయిబాబా అరెస్టు అయ్యాయి. అత్యంత కఠిన చట్టం కావడం వల్ల బెయిల్ గానీ, పెరోల్ గానీ అంత సులువుగా లభించదనే అభిప్రాయాలు ఉన్నాయి.