తృటిలో తప్పిన ప్రమాదం: రన్వే మిస్ అయిన గోఎయిర్ విమానం, ప్రయాణికులు సేఫ్
బెంగళూరు: బెంగళూరు విమానాశ్రయంలో దేశీయ విమానాయాన సంస్థ గోఎయిర్కు చెందిన విమానంకు తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. నాగ్పూర్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి చేరుకున్న గోఎయిర్ విమానం ల్యాండింగ్ సమయంలో అదుపుతప్పి రన్వేపై నుంచి పక్కకు వెళ్లింది. ప్రమాద సమయంలో విమానంలో 180 మంది ప్రయాణికులు ఉన్నారు.
జీ8-811 గోఎయిర్ విమానం గురువారం ఉదయం నాగ్పూర్ నుంచి బయలు దేరి బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయంకు 7:15 గంటలకు చేరుకుంది. ఇక ల్యాండ్ అవుతున్న సమయంలో రన్వేపై కాకుండా పక్కకు ల్యాండ్ అయ్యింది. అయితే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నట్లు గోఎయిర్ సంస్థ వెల్లడించింది. బెంగళూరులో వాతావరణం సరిగ్గా లేకపోవడంతో రన్వే పైలట్లకు కనిపించలేదని గోఎయిర్ సంస్థ చెబుతోంది. ఇదిలా ఉంటే డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఇద్దరు పైలట్లకు సమన్లు జారీ చేసింది. శుక్రవారం ఉదయం తమ ముందు హాజరై వివరణ ఇవ్వాల్సిందిగా జారీ చేసిన నోటీసుల్లో పేర్కొంది.
ఈ ఏడాది ఆగష్టులో వివిధ కారణాలను చూపిస్తూ దేశవ్యాప్తంగా 12 మంది పైలట్లను డైరెక్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ సంస్థ సస్పెండ్ చేసింది. పలు విమాన ప్రమాదాలపై విచారణ చేసిన డీజీసీఏ పైలట్ల తప్పిదం ఉందని నిర్థారించడంతో డజను మంది పైలట్లను తొలగించింది. అంతేకాదు ప్రస్తుతం ఉన్న పైలట్లకు మరింత శిక్షణ ఇవ్వాలని డీజీసీఏ ఒక నివేదిక ఇచ్చింది.
Major air mishap averted with GoAir at Bengaluru Aiprort on 11th November, aircraft landed outside the runway due to bad weather.All passengers safe. Crew was grounded and Directorate General of Civil Aviation(DGCA) has launched investigation. pic.twitter.com/4vVc8GvPAR
— ANI (@ANI) November 14, 2019
ఈ ఏడాది ఏప్రిల్ 29న ఢిల్లీ - షిర్డీ విమానం రన్వేపై దాటి ముందుకు వెళ్లిన ఘటనలో పైలట్లను సస్పెండ్ చేసింది డీజీసీఏ. జూన్ 9న ఎయిర్ ఏషియాకు చెందిన ఢిల్లీ-శ్రీనగర్ విమానంలో ఇంజిన్ ఫెయిల్ అయ్యిందని వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా అలానే విమానంను ముందుకు తీసుకెళ్లారు పైలట్లు. ఇక జూన్ 30న దుబాయ్ - మంగళూరు ఎయిరిండియా విమానం, భోపాల్ సూరత్ స్పైస్ జెట్ విమానాలు రన్వే దాటి ముందుకు వెళ్లాయి. జూలై 1వ తేదీన జైపూర్ -ముంబై స్పైస్ జెట్ విమానం ముంబై విమానాశ్రయంలోని రన్వే పై నుంచి పక్కకు వచ్చింది. జూలై 2వ తేదీన కోల్కతా విమానాశ్రయంలో స్పైస్ జెట్కు చెందిన విమానం రన్వే పక్కన ఉన్న లైట్లను ఢీకొట్టి వాటిని ధ్వంసం చేసింది.