ఈ సముద్ర జీవి విడుదల చేసే ఉమ్ముకు ఇంత డిమాండా..? ఇందులో ఏముందబ్బా..?
ముంబై: సముద్రంలో ఎన్నో జీవులు ఉంటాయి. ఆ ప్రాణుల కోసం మనిషి వేట సాగిస్తూ ఉంటాడు. సముద్రంలో వేట అంటే అందరికీ గుర్తుకు వచ్చేది చేపలు. చేపలతో పాటు కొందరు తాబేళ్లను, సొరచేపలను, తిమింగలాలను వేటాడుతుంటారు. చట్టరీత్యా కొన్ని ప్రాణులను వేటాడటం నేరమే అయినప్పటికీ మనిషి ఆశ వాటిని వేటాడేలా చేస్తున్నాయి. ఉదాహరణకు నక్షత్ర తాబేళ్లకు విదేశాల్లో భలేగిరాకీ ఉంటుందట. అదే క్రమంలో ఓ జాతికి చెందిన తిమింగలానికి కూడా భలే రేటు ఉంటుందట. అయితే తిమింగలం కంటే అది విడుదల చేసే మైనం లాంటి ద్రవానికి ఫుల్ డిమాండ్ ఉంటుంది.
మహారాష్ట్రలోని ఘట్కోపర్కు చెందిన ఓ వ్యక్తి స్ప్యూ వేల్ జాతికి చెందిన తిమింగలం ఉమ్మును రూ.1.70 కోట్లకు బహిరంగ మార్కెట్లో అమ్ముతుండగా పోలీసులు అరెస్టు చేశారు. చట్టరీత్యా ఆ ఉమ్మును అమ్మడం నేరం. ఈ ఉమ్మును యాంబర్ గ్రీస్ అని పిలుస్తారు. ఈ ద్రవం తిమింగలం పేగుల్లో తయారవుతుంది. ఈ ద్రవాన్నే తేలియాడుతున్న బంగారం అని కూడా పిలుస్తారు. ఈ ద్రవాన్ని అత్యంత ఖరీదైన సుగంధాల్లో వినియోగిస్తారు. అందుకే దీనికి అంత క్రేజ్ ఉంటుంది.
యాంబర్ గ్రీస్ను విక్రయిస్తున్నారన్న సమాచారం రావడంతో పోలీసులు కామా ప్రాంతంలోని విద్యావిహారీలో మాటువేశారు. నాగ్పూర్కు చెందిన రాహుల్ దుపారే అనే వ్యక్తి 1.3 కిలోల యాంబర్ గ్రీస్ను విక్రయిస్తుండగా అతన్ని పట్టుకున్నారు. జంతుసంరక్షణ చట్టం కింద రాహుల్ను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అంతరించిపోతున్న జంతువులను సంరక్షించాలని జంతుసంరక్షణ చట్టం 1972 చెబుతోంది. స్ప్యూ వేల్ కూడా అంతరించిపోతున్న జంతువుల జాబితాలో చేర్చబడి ఉంది. ఇక లోతైన విచారణ చేసేందుకు పోలీసులు గుజరాత్కు వెళ్లారు. అక్కడ దీనికి సంబంధించి పెద్ద ముఠానే ఉన్నట్లు సమాచారం ఉంది.