మరో రైలు ప్రమాదం: మహారాష్ట్రలో పట్టాలు తప్పిన దురంతో ఎక్స్ప్రెస్
మంగళవారం తెల్లవారుజామున నాగ్పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది.
నాగ్పూర్: రైల్వేలో వరుస ప్రమాద ఘటనలకు బ్రేక్ పడటం లేదు. తాజాగా మరో రైలు పట్టాలు తప్పడంతో.. రైల్వే భద్రతపై ఆందోళన పెరుగుతోంది. మంగళవారం తెల్లవారుజామున నాగ్పూర్-ముంబై దురంతో ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పింది. మహారాష్ట్రలోని తిత్వాల స్టేషన్ కు సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ప్రమాద ఘటనలో మొత్తం 7భోగీలు పట్టాలు తప్పగా.. ఎలాంటి ప్రాణ నష్టం సంభవించకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే కొద్దిమందికి మాత్రం స్వల్ప గాయాలైనట్లు తెలుస్తోంది. భారీ వర్షాలకు పట్టాల పైకి బురద, రాళ్లు వచ్చి చేరడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లుగా చెబుతున్నారు.
డ్రైవర్ సమయస్పూర్తితో వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పిందంటున్నారు. నిజానికి ఆ సమయంలో పొగమంచు కూడా భారీగా కమ్ముకోవడంతో తనకేమి కనిపించలేదని డ్రైవర్ తెలిపారు. ఈ ప్రమాదంతో ముంబై లోకల్ ట్రైన్ సర్వీసులు నిలిచిపోనున్నాయి.
కాగా, అగస్టు 19న పూరి-హరిద్వార్ ఎక్స్ ప్రెస్ పట్టాలు తప్పి భారీ ప్రాణ నష్టం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో 21మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలోనే రైల్వే మంత్రి సురేష్ ప్రభు సైతం రాజీనామాకు సిద్దపడగా.. ప్రధాని మోడీ పునరాలోచించుకోవాల్సిందిగా ఆయనకు సూచించారు. తాజా ప్రమాద ఘటనతో సురేశ్ ప్రభు ఎలా స్పందిస్తారా? అన్నది చూడాలి.