ఇదెక్కడి గొడవండీ బాబు...ఈ యువకుడి ఫిర్యాదుతో పోలీసులకు మైండ్ బ్లాక్
"సార్... మా ఇళ్లు ఎక్కడో పోయింది వెతికి పెట్టండి" అంటూ అలీ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసే సీన్ సినిమా థియేటర్లోని ప్రేక్షకులిని కడుపుబ్బా నవ్వించింది. ఇలాంటివి కేవలం సినిమా వరకే బాగుంటాయి. ఇదే తరహాలో ఓ పోలీస్ స్టేషన్కు వచ్చిన వ్యక్తి ఒక వింత కంప్లయింట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులకు మైండ్ బ్లాక్ అయ్యింది. ఇంతకీ ఆ మహానుభావుడు ఇచ్చిన ఫిర్యాదు ఏమిటో తెలుసా.. అయితే ఈ స్టోరీ చదవండి.
పోలీసులకు షాక్ ఇచ్చిన యువకుడు
నాగ్పూర్లోని ఓ పోలీస్ స్టేషన్కు ఒక వ్యక్తి వచ్చాడు. సార్ సార్ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఏమైంది అని అక్కడి స్టేషన్లోని ఓ పోలీస్ కానిస్టేబుల్ ఆతురతతో అడిగాడు. సార్ ఓ అమ్మాయి దొంగతనానికి పాల్పడింది అని చెప్పాడు. ఔనా... ఏమి దొంగలించింది ఎక్కడ దొంగలించింది... ఎప్పుడు దొంగలించిందంటూ కానిస్టేబుల్ వరస ప్రశ్నలు సంధించారు. ఇంతలోనే ఆ వ్యక్తి నుంచి వచ్చిన సమాధానంతో కానిస్టేబుల్ షాక్ అయ్యాడు.
నా హృదయం ఓ అమ్మాయి దొంగలించింది
ఇంతకీ ఆ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఏమిటో తెలుసా...? తన హృదయంను ఓ అమ్మాయి దొంగలించిందట. వెంటనే తన హృదయాన్ని వెతికి పట్టుకోవాలని పోలీస్ స్టేషనులో భీష్మించుకు కూర్చున్నాడు. అలాంటి ఫిర్యాదులు ఇక్కడ స్వీకరించరు అని చెప్పినప్పటికీ కూడా ఆ వ్యక్తి అక్కడి నుంచి కదలలేదు. ఏది పోయిన వెతికి పట్టకొస్తారు కదా.. మరి నా హృదయం ఆ అమ్మాయి దొంగలించింది.. వెంటనే నా హృదయం నాకు తీసుకొచ్చి ఇవ్వండంటూ స్టేషన్లో గోల చేశాడట.
కొన్ని కేసులకు పరిష్కారం దొరకదు
ఇక చేసేదేమీలేక ఇలాంటి సమస్యలకు తమవద్ద పరిష్కారం దొరకదు అని చెప్పారు. అయినప్పటికీ కుర్రాడు వినకపోవడంతో తమ పై అధికారుల దృష్టికి కానిస్టేబుల్ తీసుకొచ్చాడు. వెంటనే కలగజేసుకున్న పైఅధికారులు ఆ కుర్రాడిని వారించి ఇలాంటి ఫిర్యాదులకు భారతదేశంలో చట్టాలు లేవని చెప్పి అక్కడి నుంచి పంపించివేశారు. ఇదంతా నాగ్పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ్ ఓ సందర్భంలో చెప్పారు. దాదాపు రూ. 82 లక్షలు విలువ చేసే దొంగలించబడ్డ వస్తువులు వాటి యజమానులకు అప్పగించే కార్యక్రమం సందర్భంగా పోలీస్ కమిషనర్ ఈ స్టోరీని వారితో షేర్ చేసుకున్నారు. దొంగలించబడ్డ వస్తువులను వెతికి పట్టుకొని తిరిగి ఇచ్చేయొచ్చు... కానీ ఈ తరహా ఫిర్యాదులు వస్తే వాటిని తాము కాదు కదా... భూమిపై ఎవరూ పరిష్కరించలేరని చెప్పారు.