మోడీకి గుడి: మొన్న గుజరాత్లోని రాజ్కోట్, నిన్న ఉత్తరప్రదేశ్లోని జలాల్ పూర్
అలహాబాద్: ప్రధాని మోడీ తనకు గుడి వద్దంటూ మొర పెట్టుకుంటుంటే, ఉత్తరప్రదేశ్లో ఏకంగా మరో దేవాలయానికి శనివారం భూమి పూజ చేశారు. అలహాబాద్ పట్టణానికి 32 కిలోమీటర్ల దూరంలోని జలాల్ పూర్ గ్రామంలో ఈ దేవాలయాన్ని నిర్మించనున్నారు. ఈ దేవాలయంలో కృష్ణుడు, మోడీ విగ్రహాలను ఏర్పాటు చేస్తారు. భూమి పూజకు జలాల్ పూర్ గ్రామ పెద్ద అశ్వినీ యాదవ్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు.
ఈ భూమి పూజ కార్యక్రమానికి సమీపంలోని ప్రజలు పెద్దఎత్తున పాల్గొన్నారు. ఈ దేవాలయాన్ని శ్రీ కృష్ణ సేన ఆధ్వర్యంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయానికి అయ్యే ఖర్చుని రూ. కోటిగా అంచనా వేశారు. అలహాబాద్-వారణాసి హైవేలో ఈ దేవాలయాన్ని 10,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు.
ఈ దేవాలయానికి సంబంధించిన పనులను అమేథిలోని రాణిగంజ్కు చెందిన కామ్తా ప్రసాద్కు అప్పగించారు. ఈ దేవాలయాన్ని నిర్మించేదుకు ఇసుకని నైనాఘర్ నుంచి, మార్బల్స్ని రాజస్ధాన్లోని మకరానా నుంచి తెప్పిస్తున్నారు.
ఇక అశ్వినీ యాదవ్ విషయానికి వస్తే 2012 అసెంబ్లీ ఎన్నికల్లో ఆల్ ఇండియా లవ్ పార్టీని స్ధాపించారు. ఆ ఎన్నికల్లో హందియా అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేసిన ఆయన భార్య పుష్ప యాదవ్ 6,049 ఓట్లను గెలుచుకున్నారు.
అంతక ముందు గుజరాత్లోని రాజ్కోట్లో తన విగ్రహాన్ని ప్రతిష్టించడంపై ప్రధాని నరేంద్ర మోడీ ఆవేదన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. తన లాంటి మనుషులకు గుడి కట్టడం మన సాంప్రదాయం కాదన్నారు. రాజ్కోటలో మద్దతుదారులు తనకు గుడి కట్టారని వార్త చూసి ఒక్కసారిగా షాక్ అయ్యానంటూ పేర్కొన్నారు.
తనకు ఆలయం నిర్మించడం వ్యక్తిగతంగా చాలా బాధించిందని అన్నారు. తాను ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్కు మీ సమయాన్ని వనరులు వినియోగించడని ఆయన పేర్కొన్నారు. మీకు తీరిక, సమయం ఉంటే దయచేసి మన దేశాన్ని పరిశుభ్రంగా మార్చాలన్నారు. ఇటువంటివి మళ్లీ పునరావృతం చేయరాదంటూ ఆయన సూచించిన విషయం తెలిసిందే.