రెండు రాష్ట్రాలను భయపెట్టిన నగ్న దొంగ అరెస్ట్, ఎలా దొరికాడంటే?
తిరువనంతపురం: కేరళ, తమిళనాడు రాష్ట్ర పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన నగ్న దొంగను కేరళ పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన న్యాయశాస్త్ర విద్యార్ధి ఎడ్విన్ జోస్ నగ్నదొంగగా అవతారమెత్తాడని పోలీసులు తెలిపారు.
ఒంటిపై నూలు పోగు ఉండదు. ఒళ్ళంతా నల్లరంగు పూసుకొంటాడు. అప్పుడప్పడు తలపై అండర్ వేర్ ధరిస్తాడు. నగ్నంగా దొంగతనాలకు పాల్పడుతాడు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రజలకు, పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా ఈ దొంగ చేశారు.
ఈ దొంగ కోసం జనం రాత్రిపూట కాపలా కాసినా ప్రయోజనం లేకుండా పోయింది. అయితే ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చిన సమయంలో సీసీటీవి కెమెరాలో నిందితుడి ముఖం స్పష్టంగా రికార్డైంది. దీంతో నిందితుడిని వలపన్ని పట్టుకొన్నారు.
బైక్లను దొంగతనం చేసి వాటిపై రెక్కీ చేస్తారు. రెక్కీ చేసిన ఇళ్ళలో రాత్రి పూట దొంగతనాలకు పాల్పడతాడు ఈ నగ్న దొంగ. తమిళనాడుకు చెందిన లా స్టూడెంట్ ఎడ్విన్ జోస్ గా గుర్తించిన పోలీసులు తొలుత షాక్ తిన్నారు. ఆ తర్వాత నిందితుడిని వలపన్ని పట్టుకొన్నారు.
నిద్రపోతున్న మహిళల మెడలో బంగారు ఆభరణాలను కట్టర్ తో కత్తిరిస్తాడు. ఆ సమయంలో మహిళలు నిద్రలేస్తే వారిపై దాడి చేసి పారిపోతాడు. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని పలు గ్రామాల్లో దాడులకు పాల్పడ్డాడు.ఇప్పటికే నిందితుడిపై సుమారు 30 కేసులు నమోదు చేసినట్టు కేరళ పోలీసులు తెలిపారు. నిందితుడిని రిమాండ్ కు తరలించినట్టు పోలీసులు తెలిపారు.