బెంగళూరు మేయర్ ఎన్నికలు, ఆ ఎమ్మెల్యేలకు చెక్, ఓటర్ లిస్టులో పేర్లు మాయం !
బెంగళూరు: బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి అనర్హత వేటుకు గురైన ఎమ్మెల్యేలకు అవకాశం లేకుండా పోయింది. సెప్టెంబర్ నెలలో జరగనున్న బెంగళూరు మేయర్ ఎన్నికల ఓటరు జాబితాలో అనర్హత ఎమ్మెల్యేల పేర్లు తొలగించారు.
ఇప్పటికే అనర్హత వేటు విషయంలో సుప్రీం కోర్టులో న్యాయ పోరాటం చేస్తున్న అనర్హత ఎమ్మెల్యేలకు మరో ఎదురు దెబ్బ తగిలింది. సెప్టెంబర్ నెలలో బృహత్ బెంగళూరు మహానగర పాలికె (బీబీఎంపీ) మేయర్ ఎన్నికలు జరుగుతున్నాయి.
బీబీఎంపీ మేయర్ ఎన్నికల్లో కార్పొరేటర్లు, బెంగళూరు నగరంలోని అన్ని శాసన సభ నియోజక వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీలు ఓటు వేస్తారు. అయితే కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం మీద ఆ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు తిరుగుబాటు చెయ్యడంతో ఆ ప్రభుత్వం కుప్పకూలిపోయింది.
బీబీఎంపీ ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితాను అధికారులు తయారు చేశారు. బెంగళూరు నగరంలోని ఐదు మంది అనర్హత ఎమ్మెల్యేల పేర్లు ఓటరు జాబితా నుంచి తొలగించారు. కొత్తగా ఎన్నికైన ఎంపీల పేర్లు ఓటరు జాబితాలో పొందుపరిచిన అధికారులు బీబీఎంపీ ఎన్నికల పరిశీలకులకు పంపించారు.
బెంగళూరుకు చెందిన ఐదు మంది ఎమ్మెల్యేల మీద అనర్హత వేటు పడింది. బెంగళూరు నగరంలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు నలుగురు, ఒక జేడీఎస్ ఎమ్మెల్యే మీద అనర్హత వేటు పడింది. ఈ ఐదు మంది ఎమ్మెల్యేలు బెంగళూరు మేయర్ ఎన్నికల్లో ఓటు వెయ్యడానికి అవకాశం లేదు.
కేఆర్ పురం ఎమ్మెల్యే భైరతి బసవరాజ్, మాజీ మంత్రి, శివాజీనగర్ ఎమ్మెల్యే రోషన్ బేగ్, యశవంతపుర ఎమ్మెల్యే ఎస్.టి. సోమశేఖర్, రాజరాజేశ్వరినగర ఎమ్మెల్యే ఎం. మునిరత్న, మహాలక్ష్మి లేఔట్ ఎమ్మెల్యే (జేడీఎస్) గోపాలయ్య మీద అనర్హత వేటు పడింది.