క్యూలైన్లో నిల్చున్న ఓటర్లకు నమో ఫుడ్ ప్యాకెట్స్..నివేదిక కోరిన ఈసీ
దేశవ్యాప్తంగా తొలి విడత ఎన్నికలు జరుగుతున్నాయి. ఓటువేసేందుకు క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నాయి కొన్ని పార్టీలు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్లోని గౌతంబుద్ధ నగర్లో వెలుగుచూసింది.
ఉత్తర్ ప్రదేశ్లోని గౌతం బుద్ధ నగర్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బీజేపీ ప్రయత్నించింది. క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు కాషాయం రంగులో ఉన్న ఆహార పొట్లాలు అందించింది. నమో ఫుడ్స్ పేరుతో ఉన్న ఈ ఆహార పొట్లాలను క్యూలైన్లలో నిల్చున్న ఓటర్లకు పంచిపెట్టారు. ఈ ఘటన వెలుగు చూడటంతో ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులనుంచి నివేదిక కోరింది.
ప్రధాని నరేంద్ర మోడీని నమో అని పిలుస్తున్న నేపథ్యంలో ఆ ఆహారం ప్యాకెట్లపై కూడా నమో ఉండటంతో అనుమానం వ్యక్తం చేసిన ఈసీ అధికారులను నివేదిక కోరింది. అయితే ఆహారం పొట్లాలపై ఉన్న నమోకు బీజేపీ ప్రయోగిస్తున్న నమో పదానికి సంబంధం లేదని అధికారులు చెప్పారు. ఆహార ప్యాకెట్లను స్థానిక నమో షాప్ నుంచి కొనుగోలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు ఫలానా చోటనే ఆహారం ప్యాకెట్లు కొనుగోలు చేయాలని ఎక్కడా లేదని అధికారులు తెలిపారు.
అధికారులకు కూడా ఆహారం సప్లై చేయాల్సి ఉందని ఆ ప్యాకెట్లపై దుకాణం పేరు నమో అని ఉందని బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని జిల్లా మెజిస్ట్రేట్ తెలిపారు. అయితే నమో ఫుడ్స్ పేరుతో ఉన్న దుకాణంకు వెళ్లి ఏమైనా ఆహారం ప్యాకెట్లు సప్లై చేశారా అని ప్రశ్నించగా ఎలాంటి ఆహార పొట్లాలు సప్లై చేయలేదని యాజమాన్యం చెప్పడం విశేషం. బుధవారం నుంచి తమ దుకాణం మూసివేసి ఉందని తమకు ఎలాంటి ఆర్డర్లు రాలేదని యాజమాన్యం పేర్కొంది.