"అసాధ్యమనుకున్నది సాధ్యమైంది": 2019 సార్వత్రిక ఎన్నికల్లో మోడీ ప్రభుత్వం ట్యాగ్ లైన్ ఇదే..!
న్యూఢిల్లీ: సబ్కా సాత్ సబ్కా వికాస్ ఇది 2014 సార్వత్రిక ఎన్నకల సమయంలో బీజేపీ నినాదం. ఈ నినాదంతోనే నాడు ప్రధాని అభ్యర్థిగా ఉన్న మోడీ దేశం మొత్తం తిరిగి తన ప్రసంగాల్లో బలంగా వినిపించారు. అనంతరం అఖండ మెజార్టీతో గెలిచి ప్రధాని పీఠంపై కూర్చున్నారు. ఇక 2019 సార్వత్రిక ఎన్నికలు మరో మూడునెలల్లో జరగనున్నాయి. ఇందుకోసం బీజేపీ ఇప్పటికే తన ప్రచార పర్వాన్ని మొదలు పెట్టింది. మోడీ, అమిత్ షాలు తిరిగి బీజేపీని కేంద్రంలో అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తమ భుజస్కంధాలపై వేసుకున్నారు. ఇందులో భాగంగానే తాము పాల్గొనే బహిరంగ సభల్లో ఎన్డీఏ సర్కారు చేసిన అభివృద్ధి గురించి చెప్పుకుంటూ వస్తున్నారు. ఇక తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న కమలం పార్టీ ఈసారి మరో నినాదం ఎత్తుకోబోతోంది.
2019 ఎన్నికల్లో తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీ ఇందుకోసం ఏ ఒక్క చిన్న అవకాశం కూడా వదులుకోవడం లేదు. అందివచ్చిన అన్ని అవకాశాలు సద్వినియోగం చేసుకుని ఆ దిశగా అడుగులు ముందుకేస్తోంది. ఇందులో భాగంగానే బీజేపీ తన ప్రచారం కోసం కొత్త నినాదం వెతికి పట్టుకుంది. "న ముమ్కిన్ అబ్ ముబ్కిన్ హై" " అసాధ్యమనుకున్నది సాధ్యమైంది" అనే అర్థం వచ్చే నినాదంతో ఈసారి ప్రజల్లోకి వెళ్లనుంది బీజేపీ. అయితే ఇది అన్ని మంత్రిత్వ శాఖల నుంచి తగిన గణాంకాలు సమాచారం తెప్పించుకున్న తర్వాత అడ్వర్టైజ్మెంట్ ఇస్తారని సమాచారం. ఇందుకోసం అన్ని సంక్షేమ పథకాలపై సమాచారం ఇవ్వాల్సిందిగా ఆయా మంత్రిత్వ శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు ముందే కొత్త నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలని భావిస్తోంది కాషాయం పార్టీ. ప్రజల్లోకి వెళ్లి తమ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పథకాలు, ప్రవేశ పెట్టిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించనుంది. ఇక కేంద్రప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల్లో ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్, ఉజ్వల యోజన, ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన, బేటీ బచావో బేటీ పడావో, జన్ధన్ యోజన, కిసాన్ క్రెడిట్ కార్డుల గురించి నొక్కి ప్రజలకు వివరించనుంది.