‘ఆధార్’ రూప శిల్పి నీలేకని ఆస్తులు రూ. 7,700 కోట్లు!
బెంగళూరు: ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడిగా, ‘ఆధార్ కార్డుల' ప్రాజెక్టు రూపశిల్పిగా దేశ ప్రజలందరికీ సుపరిచితులైన నందన్ నీలేకని తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు దక్షిణ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ లోకసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆయన తన ఆస్తుల వివరాలను గురువారం మీడియా సమావేశంలో ప్రకటించారు. శుక్రవారం నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
నీలేకని, ఆయన భార్య రోహిణికి ఉన్న ఆస్తుల విలువ అక్షరాలా ఏడువేల ఏడు వందల కోట్ల రూపాయలు! ఐఐటి నుంచి డిగ్రీ పట్టా పొందాక తన జేబులో ఉన్నది కేవలం 200 రూపాయలేనని నీలేకని చెప్పారు. ఆ తర్వాత ఇన్ఫోసిస్ను పదివేల రూపాయల మూలధనంతో ప్రారంభించానని తెలిపారు. తన సంస్థ అనూహ్య విజయాలను సాధించడంతో ఆస్తుల విలువ 7,700 కోట్లకు చేరిందని నీలేకని వివరించారు.
కాగా, నీలేకని దంపతుల సంపదలో దాదాపు 80 శాతం ఇన్ఫోసిస్లో వాటాల రూపంలో ఉంది. ఈ కంపెనీలో నీలేకనికి 1.45 శాతం, ఆయన భార్యకు 1.3 శాతం మేర వాటాలు ఉన్నాయి. ‘ఇతరుల బ్యాంకు ఖాతాల్లో నేను డబ్బు దాచలేదు. ఆర్జనలపై పూర్తిగా పన్నులు చెల్లించాను.' అని నీలేకని వివరించారు. సామాజిక సేవారంగంలో తాను 15 ఏళ్లుగా కృషి చేస్తున్నానని, 1999 నుంచి సుమారు 400 కోట్ల రూపాయలను సేవా కార్యక్రమాలకు ఖర్చు చేసినట్లు నీలేకని తెలిపారు.
ఇది ఇలా ఉండగా నీలేకనిపై పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అనంత్కుమార్ తన ఆస్తుల విలువ 51 లక్షలని ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్నారు. తన భార్య తేజస్విని కంటే తనకు తక్కువ ఆస్తులే ఉన్నాయని 5 సార్లు ఎంపీగా గెలిచిన అనంత్కుమార్ ప్రకటించారు. తేజస్విని పేరిట 3.86 కోట్ల ఆస్తులున్నాయని, తమ కుటుంబం మొత్తానికి 4.4 కోట్ల ఆస్తులున్నాయని ఆయన పేర్కొన్నారు.