ఇన్పీలో నందన్ నీలేకనికి 'నో సాలరీ': కంపెనీ ఏం చెప్పిందంటే?..
నందన్ నీలేకని చివరిసారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది.
బెంగళూరు: ఇన్ఫోసిస్ సమస్యలను చక్కదిద్దడానికి రీఎంట్రీ ఇచ్చిన సంస్థ మాజీ సీఈవో నందన్ నీలేకనీ.. వేతనంగా ఒక్క రూపాయి కూడా తీసుకోవడం లేదట. ఈ విషయాన్ని ఇన్ఫీ ప్రతినిధులు స్పష్టం చేశారు. నందన్ నీలేకని చివరిసారిగా 2010లో వేతనం తీసుకున్నారని కంపెనీ తన బీఎస్ఈ ఫైలింగ్ లో పేర్కొంది.
ప్రస్తుతం ఇన్ఫోసిస్లో నందన్ నీలేకనికి 0.93శాతం వాటా ఉంది. సీఈవోగా విశాల్ సిక్కా తప్పుకోవడంతో ఇన్ఫీ కొత్త చైర్మన్గా నందన్ నీలేకని అగస్టు 24న పదవీ బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. యూబీ ప్రవీణ్ రావు, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ గా తన స్థానంలో కొనసాగుతున్నారని, ఈ బాధ్యతలు నిర్వర్తించినందుకు గాను షేర్ హోల్డర్స్ ఆమోదించిన మేరకు ఆయన వేతనం తీసుకుంటున్నారని ఇన్ఫోసిస్ స్పష్టం చేసింది.
తాత్కాళికంగా చేపట్టిన సీఈవో, మేనేజింగ్ డైరెక్టర్ పదవికి మాత్రం ఆయన ఎలాంటి అదనపు వేతనాన్ని తీసుకోవడం లేదని తెలిపింది. ఇన్ఫోసిస్ కి కొత్త చైర్మన్ గా వచ్చిన నందన్ నీలేకని తక్షణ కర్తవ్యంగా కంపెనీలో స్థిరత్వం సంపాదించడంతో పాటు కొత్త సీఈవోను అన్వేషిస్తున్నారు. ఈ విషయంలో ఇగోన్ జెహెండర్ అనే ఎగ్జిక్యూటివ్ రిక్రూట్ మెంట్ సంస్థను కూడా కంపెనీ నియమించుకున్నట్లు నీలేకని తెలిపారు.